Karimnagar Municipal Election Results: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఓట్ల లెక్కింపు పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారం కాంగ్రెస్ హవా కొనసాగింది. 1500లకుపైగా మున్సిపల్ వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. 140కిపైగా కార్పొరేషన్ డివిజన్లు గెలిచింది. నల్గొండ, ఖమ్మం, భద్రాచలం, మహబూబ్నగర్,, రామగుండం, మంచిర్యాలను కాంగ్రెస్ తనఖాతాలో వేసుకుంది. కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇదిలా ఉంటే కరీంనగర్లో బీజేపీ తొలిసారి మేయర్ పదవి దక్కించుకుంది. 66 డివిజన్లలో 33 స్థానాలతో విజయం సాధించింది.
అన్నీ తానై గెలిపించిన సంజయ్..
కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఈసారి కరీంనగర్లో కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈమేరకు అన్నీ తానై చూసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం. నిధుల ఖర్చు, ప్రకటనలు అన్నీ ప్లాన్ ప్రకారం అమలు చేసి ఫలితం సాధించారు. 33 స్థానాల్లో బీజేపీ గెలవగా బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు, ఒక ఏఐఎస్ఎఫ్ అభ్యర్థి మద్దతుతో 36 మ్యాజిక్ ఫిగర్కు చేరింది. కరీంనగర్ లోక్సభ పరిధిలో చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబర్చింది. జమ్మికుంటలో హంగ్ ఏర్పడింది. హుస్నాబాద్లో బీజేపీకి ఒక్క స్థానం కూడా రాలేదు.
త్రిమూర్తుల అండర్స్టాండింగ్
కేంద్ర మంత్రి బండి సంజయ్ (బీజేపీ), రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), మాజీ మంత్రి గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) ముగ్గురూ బీసీలు, ముగ్గురి రాజకీయ నేపథ్యం పోరాటాల గడ్డ కరీంనగర్ నుంచే మొదలైంది. తాజా మున్సిపల్ ఎన్నికల్లో ఈ ముగ్గురూ ఒక అండర్స్టాండింగ్కు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కరీనంగర్లో బీజేపీ పాగా వేయడానికి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహకరించినట్లు నగరంలో చర్చ జరుగుతోంది. ఎంఐఎం బలపడకుండా ఈ ఇద్దరూ పొత్తుకు పోలేదని తెలుస్తోంది. దీంతో నాలుగు పార్టీలు వేర్వేరేగా పోటీ చేయాల్సి వచ్చిందట. ఫలితంగా బీజేపీ లాభం చేకూరిందని బీఆర్ఎస్, కాంగ్రెస్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ముస్లిం ఓటర్లు ఉన్న చోట కూడా బీజేపీ అభ్యర్థులు గెలవడాన్ని ఇందుకు ఉదాహరణా చూపుతున్నారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరఫున ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేశారని, ప్రచారం కూడా కేవలం 9 డివిజన్లలోనే చేయడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో బండి సంజయ్ విస్తృతంగా ప్రచారం చేసి బీజేపీని గెలిపించారని తెలుస్తోంది.
హుస్నాబాద్కు దూరంగా బండి..
ఇదిలా ఉంటే.. హుస్నాబాద్లో కాంగ్రెస్ విజయంలో ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారం ఉందని తెలుస్తోంది. హుస్నాబాద్ తన నియోకవర్గం పరిధిలోనే ఉన్నా.. సంజయ్ దానిపై పెద్దగా దృష్టి పెట్టలేదట. కనీసం అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేయాలేదని అంటున్నారు. తద్వారా హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ పట్టు సడలకుండా చూశారని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ప్రచారం చేసి ఉంటే హుస్నాబాద్లో బీజేపీకి కనీసం మూడునాలుగు స్థానాలు వచ్చేవని తెలుస్తోంది. అభ్యర్థులను కూడా బలహీనులను పెట్టినట్లు సమాచారం.
ఈ ముగ్గురి రహస్య వ్యూహం బీజేపీ మేయర్ పీఠం దక్కేలా చేసిందని, కరీంనగర్లో ఎంఐఎం స్థానాలు 8 నుంచి 3కు తగ్గేలా చేసిందని, హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్కు అనకూలంగా మార్చిందన్న చర్చ జోరుగా సాగుతోంది.