spot_img
HomeతెలంగాణRK Kothapaluku: అప్పుడు కెసిఆర్ లో అహంకారం కనిపించలేదా రాధాకృష్ణా?!

RK Kothapaluku: అప్పుడు కెసిఆర్ లో అహంకారం కనిపించలేదా రాధాకృష్ణా?!

RK Kothapaluku: ఉదయాన్నే ఆంధ్రజ్యోతి పేపర్ చదవగానే ఆశ్చర్యం. రాధాకృష్ణ బై లైన్ తో అసలు కారణం అహంకారమే అనే శీర్షికతో దాదాపు బ్యానర్ స్థాయిలో వార్త కనిపించింది. కళ్ళు తుడుచుకుని ఇదేంటి ఈ రోజు ఆదివారమా అనుకునే లోగానే.. మంగళవారం అని క్యాలెండర్ గుర్తు చేసింది. సహజంగా రాధాకృష్ణ ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో తన ఆంధ్రజ్యోతి పత్రికలో పేజీలో వ్యాసం రాస్తూ ఉంటాడు. సరే తనకు తెలిసిన విషయాలను ఎటువంటి మొహమాటం లేకుండానే చెప్పేస్తాడు. సరే అది ఆయన పేపర్.. ఆయన ఇష్టం. ఇందులో తప్పు పట్టడానికి లేదు.. అయితే ప్రతి ఆదివారం కొత్త పలుకు పేరుతో ఎడిటోరియల్ పేజీలో వ్యాసం రాసే రాధాకృష్ణ.. గడచిన ఆదివారం మాత్రం రాయలేదు. ఎందుకంటే ఆరోజు ఓట్ల లెక్కింపు ఉంది కాబట్టి.. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించాయి కాబట్టి.. ఆరోజు విరామం ఇచ్చినట్టున్నాడు.. ఎన్నికల ఫలితాలు రావడం.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సహజంగానే రాధాకృష్ణ ఎగిరి గంతేశాడు. నిన్న రేవంత్ రెడ్డి కి ఇచ్చిన కితాబు, ఈరోజు రాసిన ఎడిటోరియల్ కాలమ్ రాధాకృష్ణ ఆనందాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

కెసిఆర్ మీద ఎగిరిపడ్డాడు

సహజంగానే కెసిఆర్ కు, రాధాకృష్ణకు మంచి దోస్తీ ఉంది. పాత ఆంధ్రజ్యోతి కాలంలో టిడిపి బీట్ రాధాకృష్ణ చూసేవాడు. సొంతకులపో డు కావడంతో చంద్రబాబు కూడా అప్పట్లో ఆయనకు మంచి ప్రయారిటీ ఇచ్చేవాడు. అప్పట్లోనే కేసీఆర్ కు రాధాకృష్ణకు దోస్తీ కుదిరింది. ఆ తర్వాత ఆ బంధం మరింత పెరిగింది. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఇద్దరి మధ్య కొన్నిసార్లు వైరం, మరి కొన్నిసార్లు స్నేహం చిగురించాయి. అయితే అప్పట్లో రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి బిల్డింగ్ కాలిపోయినప్పుడు కేసీఆర్ వెంటనే వెళ్లిపోయాడు. రాధాకృష్ణను పరామర్శించాడు. ప్రభుత్వ పరంగా సాయం చేస్తానని మాట కూడా ఇచ్చాడు. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయత చండీయాగం నిర్వహించినప్పుడు కేసీఆర్ రాధాకృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించాడు. సన్మానం కూడా చేశాడు.. మధ్యలో ఏం జరిగిందో తెలియదు గానీ ఇద్దరి మధ్య మళ్ళి వైరం మొదలైంది. ఇక ఆ వైరం కాస్త పెరుగుతూ పోయింది తప్ప తగ్గలేదు. దీనిని తగ్గించడానికి కేటీఆర్, కవిత ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే కేసీఆర్ ను అహంకారం ఉన్న వ్యక్తిగా రాధాకృష్ణ ఇవాళ రాసేశాడు. కెసిఆర్ అహంకారం వల్లే భారత రాష్ట్ర సమితి ఓడిపోయిందని రాసేశాడు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించిందని రాసుకొచ్చాడు..

అప్పుడు కనిపించలేదా

ఆయత చండీయాగానికి పిలిచినప్పుడు.. కార్యాలయం కాలిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కెసిఆర్ నుంచి రాధాకృష్ణకు సానుభూతి లభించింది. కానీ దానిని గుర్తు ఎరగకుండా కెసిఆర్ అహంకారం వల్లే భారత రాష్ట్ర సమితి ఓడిపోయిందని రాధాకృష్ణ రాయడం విశేషం. అంతేకాదు ప్రస్తుతం కాంగ్రెస్, మరికొద్ది రోజుల్లో భారతీయ జనతా పార్టీ నుంచి భారత రాష్ట్ర సమితి సవాళ్లు ఎదుర్కొంటుందని రాధాకృష్ణ ముందుగానే కెసిఆర్ ను హెచ్చరించాడు. అంతేకాదు 2014, 2018 ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన అనేకమంది ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో కలుపుకున్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయకుండా ఉంటుందా అని హెచ్చరించాడు. అంతేకాదు కేసీఆర్ తన అహంభావాన్ని తగ్గించుకొని ఉన్నా, కవిత కోసం రాజీ పడకుండా ఉన్నా, సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 30 శాతం మందిని మార్చినా, చంద్రబాబు వ్యవహారంలో మరోలా స్పందించి ఉన్నా, దళిత బంధు లాంటి పథకాలపై పున సమీక్షించి ఉన్నా.. ఆయనకు పరాజయం తప్పి ఉండేదని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. ఇదే రాధాకృష్ణ గతంలో కెసిఆర్ తో సయోధ్య వున్నప్పుడు ఎలాంటి రాతలు రాశాడో.. కొత్త పలుకులు ఎలాంటి పలుకులు పలికాడో అందరికీ తెలుసు.. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కేసీఆర్ మీద రాధాకృష్ణ ఎగిరి పడుతున్నాడు. కాకపోతే ఇక్కడ అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదు అనే విషయాన్ని రాధాకృష్ణ గుర్తుంచుకుంటే మంచిది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular