హైదరాబాద్ లోని ఉప్పల్ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ మందుముళ్ల రజితా పరమేశ్వర్ రెడ్డి దంపతులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. తమకు ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వీరిద్దరు పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పాజిటివ్ రిపోర్టు రాగానే ఇంటికే పరిమితమైనట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా నిన్న తమతో సన్నిహితంగా మెలిగిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో వారితో సన్నిహితంగా ఉన్నవారిలో ఆందోళన మొదలైంది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు విజయం సాధించగా అందులో ఉప్పల్ డివిజన్ హస్తం పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.