Virat Kohli : ఐర్లాండ్ పై ఒక్క పరుగు.. ఆ తర్వాత క్యాచ్ అవుట్.. అమెరికా పరిస్థితులకు అలవాటు పడలేదు కాబట్టి అలా జరిగి ఉంటుందని అభిమానులు అనుకున్నారు.
పాకిస్థాన్ పై నాలుగు పరుగులకు క్యాచ్ అవుట్.. దురదృష్టం వెంటాడిందని అభిమానులు సర్ది చెప్పుకున్నారు.
కానీ, పసి కూనలాంటి అమెరికాపై గోల్డెన్ డక్.. అది కూడా భారత మూలాలు ఉన్న బౌలర్ చేతిలో.. ఇన్నిసార్లు విఫలమైన తర్వాత అభిమానులు ఎందుకు ఊరుకుంటారు.. ఊరుకోవడం లేదు.. సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్నారు.. ఓపెనర్ గా నువ్వు పీకలేవు గాని..వన్ డౌన్ లో ఆడు అంటూ హితవు పలుకుతున్నారు.
ఈ స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు మరెవరో కాదు.. టీమిండియా పరుగుల యంత్రంగా పేరుపొందిన విరాట్ కోహ్లీ. టి20 వరల్డ్ కప్ కంటే ముందు భారతదేశంలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 700కు పైగా పరుగులు చేసి ఆరెంజ్ ట్రోఫీ అందుకున్నాడు.. గత టి20 వరల్డ్ కప్ లలో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. టోర్నీలలో హైయెస్ట్ స్కోర్ సాధించిన ఆటగాడిగా అతడు నిలిచాడు. అలాంటి ఆటగాడు ప్రస్తుతం అమెరికా మైదానాల వేదికగా తేలిపోతున్నాడు. న్యూయార్క్ మైదానంలో వరుసగా రెండుసార్లు స్వల్ప స్కోర్లు, మరొకసారి గోల్డెన్ డక్ గా అవుట్ అయ్యాడు. ఫలితంగా విరాట్ కోహ్లీని నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ” ప్లాట్ పిచ్ ల పై వీర విహారం చేసిన నువ్వు.. ఇలా తేలిపోతున్నావేంటి? స్లో మైదానాలపై నువ్వు ఆడ లేవా? ఇందుకేనా నిన్ను పరుగుల యంత్రం అని పిలిచేది.. ఇలా ఆడితే భారత జట్టు కప్ సాధిస్తుందా? ఇలా ఆడితే కప్ కాదు, మరోసారి అస్సాం వెళ్లాల్సి ఉంటుందని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి విరాట్ కోహ్లీ స్లో పిచ్ ల పై సరిగ్గా ఆడలేక పోతున్నాడు. క్రీజ్ లో కుదురుకోలేకపోతున్నాడు. వచ్చి రాగానే దూకుడుగా ఆడాలనే ప్రయత్నంలో వికెట్ కోల్పోతున్నాడు. ఇలాంటి మైదానాలపై ఆటగాళ్లు దూకుడు కంటే, సమయమనానికే ప్రాధాన్యం ఎక్కువగా ఇవ్వాలి. స్లో పిచ్ పై బంతి ఎటువైపు టర్న్ తీసుకుంటుందో అంచనా వేయడం కష్టం. అలాంటప్పుడు మైదానంపై ఆచితూచి ఆడటమే శ్రేయస్కరం. బంతి గమనం మారిన తర్వాత పరుగులు తీస్తే ఉపయుక్తంగా ఉంటుంది.. న్యూయార్క్ మైదానంపై ఎన్ని ఫిర్యాదులు ఉన్నప్పటికీ.. ఐసీసీ తన తీరు మార్చుకోవడం లేదు. అందువల్లే బ్యాటింగ్ చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు.
ఇక ఈ టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మకు జోడిగా విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. అయితే ఇంతవరకు ఈ ఇద్దరు ఆటగాళ్లు మెరుగైన భాగస్వామ్యాలను నెలకొల్పలేదు. ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా ఈ మూడు జట్లపై అత్యంత స్వల్ప స్కోర్లు నమోదు చేశారు. అటు రోహిత్ శర్మ, ఇటు విరాట్ కోహ్లీ ఉన్న ఫాం ప్రకారం చూసుకుంటే మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పాలి. కానీ అలా జరగడం లేదు. అంతంత మాత్రం రికార్డు ఉన్న బౌలర్ల చేతిలో వీరిద్దరూ అవుట్ అవుతుండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్లో పరుగుల వరద పారించిన విరాట్ కోహ్లీ.. టి20 వరల్డ్ కప్ కు వచ్చేసరికి తేలిపోతుండడం భారత అభిమానులను కలవరపరుస్తోంది. ఎందుకంటే లీగ్ దశలో భారత జట్టుకు గట్టి టీం ఎదురు కాలేదు కాబట్టి సరిపోయింది. సూపర్ -8, సెమీస్ వంటిదశలో విరాట్ కోహ్లీ ఇలానే ఆడితే మాత్రం.. ఆ ప్రభావం జట్టు పై తీవ్రంగా ఉంటుంది. అక్కడ దాకా రాకముందే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Virat kohlis opener fails should come in one down
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com