Rohit Sharma
Rohit Sharma: 2022 t20 వరల్డ్ కప్ లో అడిలైడ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఓటమి గాయం టీమిండియాను సలుపుతూనే ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు బట్లర్, బ్రూక్.. భారత్ విధించిన 164 పరుగుల విజయ లక్ష్యాన్ని అత్యంత సులువుగా చేదించారు. ఫైనల్ చేరుకుని.. పాకిస్తాన్ జట్టును ఐదు వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీ దక్కించుకున్నారు. నాడు అడిలైడ్ వేదికగా టీమిండియా కు ఎదురైన ఓటమి రాచపుండు లాగా ఇబ్బంది పెడుతూనే ఉంది.. ఆ ఓటమి నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే ఏడ్చేశాడు. ఈ దృశ్యం ప్రతి ఒక్కరినీ కలచివేసింది. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తూనే ఉంది.. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. అయినప్పటికీ టీమిండియాలో ఆ కసి తీరలేదు.
అదును కోసం ఎదురుచూస్తున్న టీమిండియాకు.. అమెరికా – వెస్టిండీస్ లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ సరైన వేదికగా మారింది. ఇంకేముంది ఎక్కడ పోగొట్టుకుందో.. అక్కడే వెతుక్కోవాలనట్టుగా.. రెచ్చిపోయి ఆడింది.. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించినప్పటికీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(57) బీభత్సంగా బ్యాటింగ్ చేశాడు. మరోసారి అర్ద సెంచరీ తో ఆకట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శివమ్ దూబే వంటి వారు విఫలమైనప్పటికీ.. సూర్య కుమార్ యాదవ్(46), హార్దిక్ పాండ్యా(23), రవీంద్ర జడేజా బ్యాట్ తో మెరుపులు మెరిపించడంతో.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ జోర్డాన్ 3 వికెట్లు పడగొట్టాడు.. ఆదిల్ రషీద్, కరణ్, టోఫ్లీ, ఆర్చర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 16.4 ఓవర్లలో 103 పరుగులకు కుప్పకూలింది. కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.. బుమ్రా రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
ఈ మ్యాచ్ విజయం అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యాడు.. మైదానాన్ని అలా చూస్తూ.. ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసిన విరాట్ కోహ్లీ వెంటనే రోహిత్ శర్మ దగ్గరికి వచ్చాడు. అతడిని ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. మరోవైపు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవి శాస్త్రి దూరం నుంచి ఇదంతా గమనించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు రిషబ్ పంత్ వెంటనే అవుట్ అయ్యాడు. రోహిత్ మాత్రం అలాగే నిగ్రహాన్ని ప్రదర్శించాడు.. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యాన్ని చూపించాడు. రోహిత్ కు సూర్య కుమార్ యాదవ్ తోడు కావడంతో టీమ్ ఇండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. దూబే గోల్డెన్ డక్ గా వెనుదిరిగినప్పటికీ.. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా వేగంగా బ్యాటింగ్ చేయడంతో టీమిండియా 171 రన్స్ చేసింది.. ఈ విజయంతో ఫైనల్ దూసుకెళ్లిన టీమిండియా..కప్ కోసం శనివారం దక్షిణాఫ్రికా తో తలపడుతుంది.
Rohit Sharma crying ??? pic.twitter.com/bbtRGTwNcK
— Jon | Michael | Tyrion (@tyrion_jon) June 27, 2024