Homeక్రీడలుక్రికెట్‌Team India Unsung Heroes : పొట్టి కప్ దక్కడంలో వీరి పాత్ర చాలా గట్టిది.....

Team India Unsung Heroes : పొట్టి కప్ దక్కడంలో వీరి పాత్ర చాలా గట్టిది.. టీమిండియా అన్ సంగ్ హీరోలు వీరే..

Team India Unsung Heroes : 2013లో ధోని నాయకత్వంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క ఐసీసీ కప్ కూడా అందుకోలేకపోయింది. 2007లో ధోని నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించింది. మరోసారి పొట్టి కప్ అందుకోలేకపోయింది. అయితే ఇంతటి సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. 2024 t20 వరల్డ్ కప్ ను రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా సగర్వంగా అందుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ లో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టి20 వరల్డ్ కప్ రెండవసారి అందుకుంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్ల సరసన నిలిచింది..

వాస్తవానికి టీమిండియా విశ్వవిజేతగా ఆవిర్భవించడం వెనక ఒకరిద్దరి ఆటగాళ్ల కృషి మాత్రమే లేదు. ఒకప్పుడు టీమ్ ఇండియా కేవలం కొంతమంది ఆటగాళ్ల మీద మాత్రమే ఆధారపడేది. అయితే ఆ సాంప్రదాయానికి తెర దించుతూ.. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా సమష్టి ప్రదర్శన చేసింది. 11 మంది ఆటగాళ్లు తమ స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేశారు. అయితే ఎక్కువగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా, బుమ్రా మాత్రమే ఫోకస్ అయ్యారు. అయితే మిగతా అన్ సంగ్ హీరోలు ఎవరంటే..

అర్ష్ దీప్ సింగ్

టి20 ప్రపంచ కప్ లో బుమ్రా ను మించి అర్ష్ దీప్ సింగ్ వికెట్లు పడగొట్టాడు.. వాస్తవానికి ఈ టోర్నీకి అర్ష్ దీప్ సింగ్ ను ఎంపిక చేసినప్పటికీ.. మహమ్మద్ సిరాజ్ ను ఆడిస్తారని అందరూ భావించారు. కానీ రోహిత్ సిరాజ్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి..అర్ష్ దీప్ సింగ్ కు అవకాశం ఇచ్చాడు.. అమెరికా మైదానాలపై ముగ్గురు పేస్ బౌలర్లను దించిన రోహిత్.. వెస్టిండీస్ మైదానాలపై సిరాజ్ కు విశ్రాంతి ఇచ్చి అర్ష్ దీప్ సింగ్ , బుమ్రా, హార్దిక్ పాండ్యా తో బౌలింగ్ వేయించాడు. మరోవైపు కులదీప్ యాదవ్ ను కూడా ప్రయోగించాడు. అయితే కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అర్ష్ దీప్ సింగ్ ఏకంగా 17 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్లో 4 ఓవర్ల బౌలింగ్ వేసి.. 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కీలకమైన రెండు వికెట్లు పడగొట్టాడు. అమెరికాపై 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సూపర్ -8 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై మూడు వికెట్లు పడగొట్టి.. కంగారు జట్టును చావు దెబ్బ తీశాడు.

రిషబ్ పంత్

రోడ్డు ప్రమాదానికి గురై.. దాదాపు 15 నెలలపాటు క్రికెట్ కు దూరమయ్యాడు రిషబ్ పంత్. ఐపీఎల్ ద్వారా మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే టి20 వరల్డ్ కప్ లో ఇతడితో పాటు సంజు శాంసన్ ను కూడా ఎంపిక చేశారు. అయితే కెప్టెన్ రోహిత్ సంజును రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి.. రిషబ్ కు అవకాశం ఇచ్చాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేస్తూ రిషబ్ ఎనిమిది మ్యాచ్లలో 171 రన్స్ చేశాడు. ఫైనల్ మ్యాచ్లలో మినహా వన్ డౌన్ లో వచ్చి వేగంగా పరుగులు చేశాడు..

అక్షర్ పటేల్

ఆల్ రౌండర్ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్ కు ఇంతవరకు తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు. అయితే ఈ టి20 వరల్డ్ కప్ లో అక్షర్ అద్భుతంగా ఆడాడు. రవీంద్ర జడేజా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. అతడి స్థానాన్ని అక్షర్ భర్తీ చేశాడు. పాకిస్తాన్ పై 20 పరుగులు చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ పై ఆరు బంతుల్లో 12, ఇంగ్లాండ్ పై 10 పరుగులు చేశాడు. ప్రమాదకరమైన బెయిర్ స్టో, బట్లర్, మొయిన్ అలీ వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఫైనల్ మ్యాచ్ లోనూ దక్షిణాఫ్రికాపై 47 పరుగులు చేశాడు.

ఫీల్డింగ్ లో తీర్చిదిద్దారు

ఇక భారత జట్టు సాధించిన విజయాలలో ఫీల్డింగ్ ముఖ్యపాత్ర పోషించింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు ఫీల్డింగ్ కోచ్ దిలీప్ జట్టు ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చారు. సీనియర్లు, కుర్రాళ్ళు అని తేడా లేకుండా రాటు తేల్చారు. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత.. బెస్ట్ ఫీల్డర్ పురస్కారం అందించారు. గత వన్డే ప్రపంచ కప్ నుంచి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఫైనల్ మ్యాచ్ మినహా.. మిగతా అన్నిట్లో అది వర్కౌట్ అయింది. ఇక తాజాగా టి20 వరల్డ్ కప్ లోనూ ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పై అక్షర్ పటేల్, ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై సూర్య కుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ విన్యాసాలు.. భారత ఫీల్డింగ్ లో పెరిగిన ప్రమాణాలను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇక ప్రతి మ్యాచ్ లోనూ దాదాపు 20 నుంచి 25 పరుగుల వరకు రవీంద్ర జడేజా అడ్డుకున్నాడు.

దిలీప్ తో పాటు త్రో స్పెషలిస్టులు రఘు, నువాన్ కూడా టీమిండియా ఆటగాళ్లకు అద్భుతమైన శిక్షణ ఇచ్చారు.. ఇక దిలీప్ హైదరాబాద్ అండర్ – 25 జట్టుకు నాయకత్వం వహించాడు. పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ క్రికెట్ ఆడేవాడు. అండర్ -25 తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లీగ్ మ్యాచ్లలో క్లబ్ క్రికెట్ ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో డెక్కన్ చార్జెస్ జట్టుకు సహాయక ఫీల్డింగ్ కోచ్ గా పనిచేశాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular