India Vs England Semi Final Practice: సాధారణంగా మనం ఏదైనా పని మీద బయటకు వెళ్తే ఎవరైనా తుమ్మితే ఆగిపోతాం. పిల్లి ఎదురుగా వస్తే ప్రయాణాన్ని కొద్దిసేపు నిలిపివేస్తాం. బల్లి లేదా కుక్క లాంటి జంతువు ప్రమాదానికి సంకేతంలాగా అరిస్తే ఆగిపోతాం. చాలామంది వీటిని మూఢనమ్మకాలు అంటుంటారు. కానీ మెజారిటీ ప్రజలు వీటిని కచ్చితంగా ఫాలో అవుతూ ఉంటారు.
Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే
సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. కొన్ని కొన్ని నమ్మకాలను టీమ్ ఇండియా ప్లేయర్లు కూడా పాటిస్తుంటారు. మంగళవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడింది. గ్రహణం నేపథ్యంలో చాలావరకు ఆలయాలను మూసివేశారు. గ్రహణం వీడిపోయిన తర్వాత ఆలయాలను తెరిచి శుద్ధి చేశారు. టీమిండియా ప్లేయర్లు కూడా దాదాపుగా అలాంటి పని చేశారు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ కోసం టీం ఇండియా ప్లేయర్లు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్లేయర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. గ్రహణం వల్ల షెడ్యూల్ టైమింగ్స్ మొత్తం మార్చేశారు. ఇదే విషయంపై జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సాయంత్రం 6: 47 నిమిషాలకు గ్రహణం ముగిసిపోవడంతో.. ఏడు గంటల నుంచి ప్లేయర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
గ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని.. అందువల్లే ప్లేయర్లు మైదానంలోకి దిగలేదని తెలుస్తోంది. “గ్రహణం సమయంలో ప్లేయర్లు మైదానం వెలుపల ఉన్నారు. సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. గ్రహణం ముగిసిపోయిన తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చారు.. ఇదే విషయాన్ని జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ప్లేయర్లు ఆధునికమైన భావాలు కలిగి ఉన్నప్పటికీ.. కొన్ని కొన్ని విషయాలలో సాంప్రదాయాలను పాటిస్తారని ఈ సంఘటన ద్వారా తెలిసిపోయింది. మరోవైపు ముచ్చటగా మూడోసారి వరుసగా సెమీఫైనల్ టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్ జట్టు మీద విజయం సాధించాలని భావిస్తుంది. 2022లో ఇంగ్లాండ్ జట్టు చేతిలో సెమీఫైనల్ లో టీమిండియా ఓడిపోయింది. 2024లో ఇంగ్లాండ్ జట్టును రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా ఓడించింది. 2007 తర్వాత దాదాపు 17 సంవత్సరాల అనంతరం టీమిండియా విజేతగా నిలిచింది. ఇప్పుడు సెమి ఫైనల్ వెళ్లిన నేపథ్యంలో.. టీమిండియా కచ్చితంగా ఇంగ్లాండ్ మీద విజయం సాధిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఫైనల్ లో ప్రవేశించి విజేతగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.