Homeక్రీడలుT20 World Cup 2024: పాకిస్తాన్ ఫ్లాప్.. బాబర్ నీ కష్టం పగోడికి కూడా రావద్దు...

T20 World Cup 2024: పాకిస్తాన్ ఫ్లాప్.. బాబర్ నీ కష్టం పగోడికి కూడా రావద్దు స్వామి

T20 World Cup 2024: గత వన్డే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. దీంతో జట్టులో పెను మార్పులు సంభవించాయి. అయినప్పటికీ ఆ జట్టు విజయాల బాట పట్టలేదు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను డ్రా గా ముగించుకుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 సిరీస్ ను కోల్పోయింది. ఐర్లాండ్ తో జరిగిన మూడు టి20 సిరీస్ ను 2-1 తో గెలుచుకుంది. అంటే పాకిస్తాన్ ఆట ఐర్లాండ్ జట్టుతో సమానంగా మారింది. బౌలింగ్ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. బ్యాటింగ్ ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో అర్థం కాదు. ఫీల్డర్లు ఎందుకు బంతులు వదిలివేస్తారో ఎంతకీ అంతు పట్టదు. పాకిస్తాన్ దరిద్రపు దేశమే కావచ్చు గాని.. ఆ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం ఆటగాళ్లకు చెప్పుకునే స్థాయి కంటే ఎక్కువగానే వేతనాలు ఇస్తుంది. అనేక రకాల సౌలభ్యాలు కల్పిస్తోంది. అయినప్పటికీ ఆటగాళ్ల ఆట తీరు మారడం లేదు.

టి20 వరల్డ్ కప్ కంటే ముందు పాకిస్తాన్ ఆటగాళ్లకు ఆ జట్టు మేనేజ్మెంట్ ఆర్మీతో ట్రైనింగ్ ఇప్పించింది. సింధు ప్రావిన్స్ పరిసర ప్రాంతాల్లో ఎత్తైన గుట్టలు ఎక్కించింది. కఠినమైన ట్రెక్కింగ్ చేయించింది. దీంతో ఈసారి కప్ పాకిస్తాన్ జట్టు దే అని ప్రకటన కూడా చేసింది. దీనికి తోడు ఆటగాళ్లు కూడా అదే స్థాయిలో కామెంట్స్ చేశారు. చాలామంది పాకిస్తాన్ ఈసారి బలవంతమైన ప్రణాళికలతోనే రంగంలోకి దిగుతోందని అనుకున్నారు. ఇక ఈ వ్యాఖ్యలకు తోడు పాకిస్తాన్ జట్టులో సమూల మార్పులను ఆ మేనేజ్మెంట్ చేపట్టింది. కెప్టెన్ గా బాబర్ అజాం ను నియమించింది. రిజ్వాన్ పకార్, అమీర్ వంటి వారితో బలమైన జట్టును నిర్మించింది..

అంతటి బలమైన జట్టు తన ప్రారంభ మ్యాచ్లో అమెరికా చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి టి20 ర్యాంకింగ్స్ పరిశీలిస్తే ఆటతీరులో పాకిస్తాన్ కు, అమెరికాకు సంబంధం లేదు. కానీ అమెరికా అద్వితీయమైన ఆట తీరుతో పాకిస్తాన్ జట్టును పడుకోబెట్టింది. సూపర్ ఓవర్ లో తిరుగులేని విజయాన్ని సాధించి.. బాబర్ సేనకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది.. ఈ ఓటమి ఇలా ఉంటే.. భారత జట్టుతో జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఓడిపోయింది. వాస్తవానికి ఈ మ్యాచ్ కనుక పాకిస్తాన్ గెలిచి ఉంటే సూపర్ -8 కు వెళ్లి ఉండేది. కానీ ఒత్తిడిలో బ్యాటర్లు చేతులెత్తేయడంతో, పాకిస్తాన్ స్వల్ప స్కోరును కూడా చేజ్ చేయలేక ఓటమిపాలైంది. దీంతో పాకిస్తాన్ జట్టుకు సూపర్ -8 అవకాశాలు ముగిసిపోయాయి. లీగ్ దశలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లోనూ చచ్చి చెడి గెలిచింది. కెప్టెన్ బాబర్ ఆజాం చివరి వరకు క్రీజ్ లో ఉండి గెలిపించాడు.

ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు మరింత పెరిగాయి. వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్, వకార్ యూనిస్ వంటి మాజీ ఆటగాళ్లు జట్టు తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ దశలోనే బాబర్ ఆజాం విలేకరులతో మాట్లాడాడు. ” జట్టు బౌలింగ్ బాగుంది. బ్యాటర్లు కీలక సమయంలో చేతులెత్తేశారు. ఇది జట్టు ఆట తీరును తీవ్రంగా ప్రభావితం చేసింది. అయితే ఎందులో లోపాలు ఉన్నాయో సమీక్షించుకుంటాం. కచ్చితంగా జట్టును ప్రక్షాళన చేస్తాం. అయితే ఇంతటి దానికే నన్ను కెప్టెన్సీ నుంచి పక్కన పెడతారా? అలా జరగదని నేను భావిస్తున్నా. జట్టు ఓటములకు నేను బాధ్యత తీసుకోలేను. ఎందుకంటే కెప్టెన్ గా 11 మంది ఆట నేను ఆడలేను కదా” అంటూ బాబర్ వ్యాఖ్యానించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular