SRH Vs Lucknow: ఉప్పల్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తిరుగులేని రికార్డులు ఉన్నాయి. 2013 నుంచి ఈ గ్రౌండ్లో 63 మ్యాచ్లు జరిగాయి. ఇందులో హైదరాబాద్ 38 విజయాలు సొంతం చేసుకుంది. విన్నింగ్ పర్సంటేజ్ ఏకంగా 61 పైగానే ఉంది. ఇదే మైదానం మీద రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 2025 సంవత్సరంలో హైదరాబాద్ జట్టు 286 పరుగులు చేసింది. గత ఏడాది పంజాబ్ జట్టుపై 247 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో జట్టుతో ఆదివారం హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు.. మొదటి మ్యాచ్లో ఓడిపోయింది. రెండో మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పాయింట్ల పట్టికలో స్థానాన్ని సుస్థిరంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి హైదరాబాద్ జట్టుపై ఉంది.
హైదరాబాద్ జట్టు లో టాప్ 5 బ్యాటర్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఓపెనర్లు కోల్ కతా జట్టుపై అదరగొట్టారు. అయితే ఆరంభం అదిరిపోతున్నప్పటికీ.. కీలక దశలో వికెట్లు పడిపోవడం హైదరాబాద్ జట్టును ఇబ్బంది పెడుతోంది. కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఈ క్రమంలో లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో అటువంటి పరిస్థితిని ఎదుర్కోవద్దని అభిమానులు భావిస్తున్నారు.
ముఖ్యంగా హెడ్, అభిషేక్ శర్మ 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని.. మెరుపు ఆరంభాన్ని అందిస్తే.. మిగతా బ్యాటర్లు దానికి కొనసాగింపుగా ఆడతారని అభిమానులు భావిస్తున్నారు.. కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో హెడ్, అభిషేక్ శర్మ అదరగొట్టినప్పటికీ.. ఆ తర్వాత విఫలమయ్యారు. దీంతో జట్టు స్కోర్ 250 కి పైగా వెళుతుందనుకుంటే.. 200+ దగ్గరే ఆగిపోయింది.
ఉప్పల్ మైదానంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్ల గెలుపు శాతం 57గా నమోదయింది. హోమ్ గ్రౌండ్లో లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో కచ్చితంగా గెలవాలని ఆరెంజ్ ఆర్మీ పట్టుదలతో ఉంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ప్లాట్ ట్రాక్.. ఫాస్ట్ ఔట్ ఫీల్డ్.. చిన్న బౌండరీల వల్ల పరుగులు ధారాళంగా వచ్చే అవకాశం ఉంది. కొత్త బంతి వల్ల ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 220 నుంచి 230 వరకు లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.