RR Vs RCB IPL 2024: రాజస్థాన్ జట్టుతో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. సెంచరీ చేసినప్పటికీ అతనిపై నెట్టింట విమర్శలు వస్తూనే ఉన్నాయి. విరాట్ కోహ్లీ 72 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 113 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. విరాట్ కోహ్లీకి ఇది ఐపీఎల్ లో 9వ సెంచరీ. ఓపెనర్ గా బరిలోకి దిగి చివరి వరకు క్రీజ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. సహచర బ్యాటర్లు పెద్దగా ఆడకపోయినప్పటికీ.. జట్టు బ్యాటింగ్ భారాన్ని మొత్తం తను ఒక్కడే మోసాడు.
కోహ్లీ వల్లే..
కోహ్లీ చేసిన 113 పరుగుల వల్లే బెంగళూరు భారీ స్కోర్ చేయగలిగింది. లేకుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. కోహ్లీ ఒక్కడు 113 పరుగులు చేస్తే.. బెంగళూరు ఆటగాళ్లు 48 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేశారు. దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఎంత విలువైన ఇన్నింగ్స్ ఆడాడో. కోహ్లీ సెంచరీ ద్వారా బెంగళూరు అద్భుతమైన రికార్డులను తన సొంతం చేసుకుంది. ఈ జట్టు ఖాతాలో ఇప్పటివరకు 17 సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ చేసిన 100 పరుగులతో ఆ సంఖ్య 18 కి చేరుకుంది. బెంగళూరు తర్వాత 14 సెంచరీలతో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉన్నాయి.
విమర్శల మీద విమర్శలు
కోహ్లీ సెంచరీ చేసినప్పటికీ సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. సెల్ఫిష్ గా ఆడాడు అంటూ కొంతమంది అతడిని ట్రోల్ చేస్తున్నారు. 12 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండి.. స్లో ఇన్నింగ్స్ ఆడాడని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ లో నెమ్మదిగా సెంచరీ చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ మనీష్ పాండే సరసన నిలిచాడని నెటిజన్లు విమర్శిస్తున్నాడు. రెండువేల తొమ్మిదిలో బెంగళూరు తరఫున మనిష్ పాండే దక్కన్ చార్జర్స్ పై 67 బంతుల్లో సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై కూడా శనివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ 67 బంతుల్లోనే సెంచరీ చేశాడు. వీరిద్దరూ బెంగళూరు ఆటగాళ్ళే కావడం విశేషం. ఐపీఎల్ లో మనీష్ పాండే 67, విరాట్ కోహ్లీ 67, సచిన్ టెండూల్కర్ 66, డేవిడ్ వార్నర్ 66, బట్లర్ 66 బంతుల్లో 100 పరుగులు సాధించారు. స్లో యేస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ళుగా కొనసాగుతున్నారు.
అరుదైన మైలురాయి
ఈ సెంచరీ ద్వారా విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. టి20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడవ ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు 22 సెంచరీలతో క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. బాబర్ ఆజాం 11 సెంచరీలతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. విరాట్ కోహ్లీ 9 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్ 8 సెంచరీలతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.