IPL 2024 RR Vs RCB: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో బెంగళూరు చెన్నై జట్టుతో తలపడింది. ఆ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 20 ఓవర్లు ఆడిన బెంగళూరు 173 పరుగులు చేస్తే.. చేజింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఆరు వికెట్ల తేడాతో బెంగళూరును మట్టికరిపించింది.
పంజాబ్ జట్టుతో చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 178 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ జట్టు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు జట్టు నాలుగో వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కోల్ కతా జట్టు తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఆరు వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా మూడు వికెట్ల కోల్పోయి 186 పరుగులు చేసింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
సొంత మైదానంలోనే లక్నో జట్టుతో జరిగిన మరో మ్యాచ్ లో .. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 181 రన్స్ చేసింది. సొంత మైదానంలో చేజింగ్ ప్రారంభించిన బెంగళూరు 153 పరుగులకే ఆల్ అవుట్ అయింది. 28 పరుగుల తేడాతో ఓటమిని చవి చూసింది.
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు మూడు వికెట్లకు 183 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇలా ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఒక్కటంటే ఒక్కటే విజయం సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరులో ఆటగాళ్లు లేరా అంటే.. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. మిగతావారు ఏదో వచ్చామా? వెళ్ళామా? అన్నట్టుగా ఆడారు. ఒక మ్యాచ్ లో దినేష్ కార్తీక్ మెరిస్తే.. మరో మ్యాచ్ లో డూప్లెసిస్, ఇలా ఒకరిద్దరు తప్ప.. మిగతావాళ్లు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన దాఖలాలు లేవు. నెట్ రన్ రేట్ దారుణంగా కోల్పోతున్న ఆ జట్టు.. తీవ్ర విమర్శల పాలవుతోంది. అయినప్పటికీ ఆటగాళ్ల ఆట తీరులో మార్పు రావడం లేదు. పైగా చెత్త ఇన్నింగ్స్ ఆడుతూ పరువు తీసుకుంటున్నారు.
ఉదాహరణకు రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ నే తీసుకుంటే మాక్స్ వెల్ 1, గ్రీన్ 9 పరుగులు చేశారంటే వారి బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 113 పరుగులు చేశాడు కాబట్టి బెంగళూరు గౌరవప్రదమైన స్కోర్ సాధించింది.. లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు ఆటగాళ్లు మొత్తం 48 బంతుల్లో 59 పరుగులు మాత్రమే చేశారని గణాంకాలు చెబుతున్నాయి. ఇలాంటి ఆట ఆడుతుంటే.. ప్రత్యర్థి జట్లపై ఎలా విజయ సాధిస్తారో బెంగుళూరు ఆటగాళ్లకే తెలియాలి.
బ్యాటింగ్ ఇలా ఉందంటే.. బౌలింగ్ కూడా అత్యంత నాసిరకంగా ఉంది. మహమ్మద్ సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయలేకపోతున్నారు. కామెరూన్ గ్రీన్, మయాంక్ దగర్, హిమాన్షు శర్మ, యశ్ దయాళ్, టోప్లీ వంటి వారు ఉన్నప్పటికీ.. బౌలింగ్ అత్యంత పేలవంగా ఉంటున్నది. ఉదాహరణకు బెంగళూరు సొంత మైదానంలో లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ నే చూసుకుంటే.. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో 181 పరుగులు చేసింది. సొంత మైదానంలో వీరోచితంగా బౌలింగ్ చేయాల్సిన బెంగళూరు బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు.. బౌలింగ్ అలా ఉందనుకుంటే.. బ్యాటింగ్ ఇంకా అత్యంత నాసిరకంగా ఉంది. గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు ఆటగాళ్లు పెవిలియన్ వెళ్లేందుకు పోటీపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగళూరు ఆటగాళ్ల వైఫల్యాలు ఎన్నో.
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడు సెంచరీ సాధించినప్పటికీ.. 180 కి మించిన పరుగులు ఉన్నప్పటికీ.. ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు ఆటగాళ్లు విఫలమయ్యారు. ముఖ్యంగా బౌలర్లు పేలవంగా బంతులు వేశారు. ఫలితంగా 19.1 ఓవర్లలోనే రాజస్థాన్ లక్ష్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో జోస్ బట్లర్ ఇన్నింగ్స్ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. ఎందుకంటే చేజింగ్ లో అతడు బెంగళూరు బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నాడు. రాజస్థాన్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.. ఈ ఓటమి నేపథ్యంలో బెంగళూరు ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఇప్పటివరకు బెంగళూరు సొంత మైదానంలో మూడు మ్యాచ్ లు ఆడితే.. అందులో ఒక పంజాబ్ మీద మాత్రమే విజయం సాధించింది. లక్నో, కోల్ కతా తో జరిగిన మ్యాచ్లలో ఓటమిపాలైంది. దీంతో నెటిజన్లు బెంగళూరు జట్టును ఏకిపారేస్తున్నారు. సొంతం మైదానంలో గెలవరు.. బయటి మైదానాల్లో నెగ్గరు.. ఎన్నాళ్లు ఈ దరిద్రమంటూ మండిపడుతున్నారు.