IND vs PAK: టి20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద భారత మహిళల జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్లో తడబడినప్పటికీ.. చివర్లో తేరుకుని భారత్ 170 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తలవంచింది.. ముందుగా దూకుడు ప్రదర్శించినప్పటికీ.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది.
భారత జట్టు విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని సాధించే క్రమంలో పాకిస్తాన్ జట్టు మొదట్లో దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.. రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ మునిబా (41) ఎదురుదాడితో పాకిస్తాన్ 6.3 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. పాకిస్తాన్ విజయం మీద సంపూర్ణ విశ్వాసంతో ఉంది. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు పట్టు బిగించారు. ముఖ్యంగా దీప్తి శర్మ అద్భుతమైన బంతులు వేయడంతో ఏ సందర్భంలోనూ పాకిస్తాన్ జట్టు కోలుకునే విధంగా కనిపించలేదు. దీప్తి శర్మ ఏకంగా ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. తెలుగు అమ్మాయి శ్రీ చరణీ మూడు వికెట్లు సాధించింది. షఫాలివర్మ ఒక వికెట్ దక్కించుకుంది. పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వికెట్లు మొత్తం వీరు ముగ్గురు సొంతం చేసుకోవడం గమనార్హం. ఒక దశలో గెలిచే విధంగా కనిపించిన పాకిస్తాన్.. తీవ్రంగా తడబడింది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.
టీమిండియా ఇన్నింగ్స్ కూడా అంత గొప్పగా ప్రారంభం కాలేదు.. షఫాలి వర్మ ఆకట్టుకోలేదు. జెమీమా, భారతి ఒక పరుగు చొప్పున మాత్రమే చేశారు. స్మృతి మందాన (64), కెప్టెన్ కౌర్(36), రీఛాగోష్ (34) పరుగులు చేయడంతో టీమిండియా 170 రన్స్ స్కోర్ చేసింది. రీఛాగోష్ 19 ఓవర్లో 24 పరుగులు చేయడంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది.. దీంతో టీమ్ ఇండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఒకరకంగా టీమిండియా విజేతగా నిలవడానికి ఆ ఓవర్ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.. ఆ ఓవర్ లో 24 పరుగులు రావడం టీమిండియా స్కోర్ బోర్డును పూర్తిగా మార్చేసింది. పాకిస్తాన్ ముందు ఒక భారీ స్థాయి లక్ష్యాన్ని విధించేలా చేసింది.
ఈ విజయం టీమిండియా మహిళల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. భారీగా అంచనాలున్న ప్లేయర్లు.. వాటిని అందుకోలేకపోయినప్పటికీ.. మిగతా ప్లేయర్లు జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడటం విశేషం. ఒక దశలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన జట్టును.. కెప్టెన్ కౌర్.. స్మృతి ఆదుకున్నారు. చివర్లో రీచా అదరగొట్టింది.. ఇక బౌలింగ్లో దీప్తి.. శ్రీ చరణి సత్తా చూపించారు.. అందువల్లే భారత్ అద్భుతమైన గెలుపును దక్కించుకుంది.. లోపాలు సవరించుకొని.. టీమ్ ఇండియా తదుపరి మ్యాచ్లలో జోరు చూపిస్తే వన్డే వరల్డ్ కప్ మాదిరిగానే.. టి20 వరల్డ్ కప్ కూడా మన చేతుల్లో వచ్చి చేరుతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

