Pakistan Vs Sri Lanka Super 8: కొలంబో వేదికగా జరుగుతున్న సూపర్-8 కీలక మ్యాచ్లో పాకిస్థాన్ భారీ స్కోర్ సాధించినా… వారి సెమీఫైనల్ ఆశలు మాత్రం ఇంకా అనిశ్చితిలోనే ఉన్నాయి. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Also Read: తిరుమలేషుడి భక్తుల కోసం టీటీడీ సంచలన నిర్ణయాలు
పాకిస్థాన్కు ఓపెనర్లు సహిబ్జాద ఫర్హాన్, ఫకర్ జమాన్ అద్భుత ఆరంభం ఇచ్చారు. ఫర్హాన్ కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈ ప్రపంచకప్లో అతడికిది రెండో శతకం కావడం విశేషం. మరోవైపు ఫకర్ జమాన్ 84 పరుగులతో దూకుడుగా ఆడాడు. ఈ జంట తొలి వికెట్కు 176 పరుగులు జోడించి శ్రీలంక బౌలర్లను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది.
అయితే, ఆ దశ వరకు బలంగా కనిపించిన పాక్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 176 పరుగుల వద్ద మొదటి వికెట్ పడిన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. కేవలం 36 పరుగుల వ్యవధిలోనే ఎనిమిది వికెట్లు చేజార్చుకుని ఇన్నింగ్స్ను పూర్తిచేసింది. శ్రీలంక బౌలర్లలో మధుషంక మూడు వికెట్లు తీసుకోగా, కెప్టెన్ దాసున్ శనక రెండు, చమీర ఒక వికెట్ దక్కించుకున్నారు.
అయితే ఈ భారీ స్కోర్ కూడా పాకిస్థాన్కు సరిపోదు. సెమీఫైనల్కు చేరాలంటే కేవలం గెలవడం సరిపోదు… శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాలి. అంతకంటే ఎక్కువ రన్స్ ఇచ్చి గెలిచినా నెట్రన్రేట్ పరంగా పాకిస్థాన్ వెనుకబడుతుంది. అటువంటి పరిస్థితిలో న్యూజిలాండ్ సెమీస్లోకి అడుగుపెడుతుంది.
ఇక శ్రీలంక చేతిలో ఓటమి పాలైతే పాకిస్థాన్కు టోర్నీ ముగిసినట్టే. అందుకే ఈ మ్యాచ్ పాకిస్థాన్కు “డూ ఆర్ డై”గా మారింది. మొదట్లో అద్భుతంగా ఆడినా… చివర్లో వికెట్లు వరుసగా కోల్పోవడం వారి పరిస్థితిని సంక్లిష్టంగా మార్చింది.
అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… చివర్లో కొట్టిన పరుగులు పాకిస్థాన్ను కాపాడతాయా? లేక ఆరిపోయే దీపంలా వారి ప్రయాణం ఇక్కడితో ముగుస్తుందా?