MI Vs KKR: ఐపీఎల్ 17వ సీజన్లో హైయెస్ట్ స్కోర్లు నమోదవుతుండటంతో ఆమధ్య రాజస్థాన్ బౌలర్, టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ” దేవుడా మా బౌలర్లను నువ్వే కాపాడు” అంటూ ట్వీట్ చేశాడు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. చాలామంది బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ తో ఏకీభవించారు. అనంతరం గుజరాత్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్లు పండగ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ స్థాయిలో బౌలర్లు ఏకపక్షంగా వికెట్లు తీసిన చరిత్ర గాని, ఆల్ అవుట్ చేసిన ఘనత గాని నమోదు కాలేదు. కానీ ప్రస్తుత ఐపీఎల్ 17వ సీజన్లో తొలిసారిగా పోటీపడిన రెండు జట్లు ఆల్ అవుట్ అయ్యాయి.. 20 వికెట్లు నేలకూలడంతో తొలిసారిగా బౌలర్లు మీసం తిప్పారు. వాంఖడే స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ పోటీపడ్డాయి.. ఈ మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ముంబై జట్టు ఓడిపోయింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆ జట్టు.. ఈసారి అత్యంత అనామకంగా గ్రూప్ దశ లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్న కోల్ కతా జట్టు.. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసింది. ముంబై బౌలర్ల ధాటికి 169 పరుగులకు ఆల్ అవుట్ అయింది. అనంతరం 170 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై జట్టు, 18.5 ఓవర్లలో 145 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఆల్ అవుట్ కావడం ఇది నాలుగోసారి. 2010లో నాగ్ పూర్ వేదికగా దక్కన్ చార్జెస్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్లో రెండు జట్లూ ఆల్ అవుట్ అయ్యాయి. 2017లో కోల్ కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో రెండు జట్లూ ఆల్ అవుట్ అయ్యాయి. 2018లో ముంబై వేదికగా హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లోను రెండు జట్లూ ఆలౌట్ అయ్యాయి. 2024 లో ముంబై వేదిక జరిగిన మ్యాచ్లో కోల్ కతా, ముంబై జట్లు తలపడగా, రెండూ ఆల్ అవుట్ అయ్యాయి.
వాస్తవానికి ఈ మ్యాచ్లో కోల్ కతా జట్టు తరఫున వెంకటేష్ అయ్యర్ కనుక 70 పరుగులు, మనీష్ పాండే 42 పరుగులు చేసి ఉండకపోతే, ఆ జట్టు 120 లోపే ప్యాకప్ అయ్యేది. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2, పీయూష్ చావ్లా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో కోల్ కతా ఏడో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్లో కోల్ కతా ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడింది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ముంబై జట్టు తరఫున సూర్య కుమార్ యాదవ్ మాత్రమే నిలబడ్డాడు. అతడు 35 బంతుల్లో 56 పరుగులు చేశాడు. కోల్ కతా బౌలర్లలో స్టార్క్ 4, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, రస్సెల్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. ముంబై జట్టు ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడగా.. కేవలం 3 విజయాలు మాత్రమే దక్కించుకుంది. పాయింట్లు పట్టికలో 9వ స్థానంలో కొనసాగుతోంది.