YS Sharmila Jagan: సోదరి షర్మిల విషయంలో జగన్ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆమెను మిస్ అవుతున్నట్లు చెప్పారు. తమ మధ్య ప్రేమానురాగాలను గుర్తు చేశారు.దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్లిపోయింది కానీ.. మా మధ్య ప్రేమలు ఎక్కడికి పోతాయి అంటూ నిట్టూర్చారు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు.. సమాధానం ఇచ్చే క్రమంలో షర్మిల పై తనకున్న అభిప్రాయాన్ని జగన్ వెల్లడించారు. గత కొద్ది రోజులుగా జగన్ సోదరి షర్మిల వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి మధ్య సంబంధాలు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి పిల్లలుగా జగన్ తో పాటు షర్మిల కు మంచి గుర్తింపు ఉంది. సోదరుడు జగన్ కోసం షర్మిల ఎంతో పరితపించారు. జగన్ అధికారంలోకి రావడానికి తనవంతు పాత్ర పోషించారు. అన్నింటికీ మించి క్లిష్ట సమయంలో జగన్ కు అండగా నిలిచారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అటు షర్మిల సైతం తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసుకొని ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. పెద్దగా వర్క్ అవుట్ కాకపోయేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు షర్మిల. తెలంగాణకే పరిమితం అవుతారని భావించిన షర్మిల ఏపీలో ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నారు. అప్పటి నుంచే జగన్ పై పోరాడడం ప్రారంభించారు. గట్టి ఫైట్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ను కార్నర్ చేసి తరచూ మాట్లాడుతున్నారు. ఏకంగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. దీంతో షర్మిల రూపంలో తనకు ఇబ్బందులు తప్పవని జగన్ భావిస్తున్నారు. అయితే ఇటీవలే ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె పసుపు రంగు చీర ధరించి.. చంద్రబాబును కలవడాన్ని ఎద్దేవా చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇది నీచాతి నీచమని.. స్వయానా సోదరి కట్టుకున్న చీరపై మాట్లాడిన జగన్ తీరుపై షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అయితే ఇటీవల నేషనల్ మీడియాకు జగన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. చెల్లి షర్మిలను మిస్ అవుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎస్ ఖచ్చితంగా మిస్ అవుతున్నా.. దురదృష్టవశాత్తు ఆమె బయటకు వెళ్ళింది. కానీ ప్రేమలు ఎక్కడికి పోతాయి? చంద్రబాబుతో కలిసి ఆయన చెప్పినట్లు చేస్తోంది. మా కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ లో చేరింది. మా కుటుంబ సభ్యురాలై ఉండి కూడా బయటకు వెళ్లడం.. శత్రువులతో చేతులు కలపడం నాకు బాధ కలిగిస్తోంది అంటూ జగన్ బదులిచ్చారు. అయితే షర్మిల విషయంలో ఇన్ని రోజులు వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్.. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఇది వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.