Jay Shah: ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. రికార్డ్ స్థాయిలో జట్లు పోటీ పడ్డాయి. ఈక్వెడార్ నుంచి మొదలు పెడితే ఖతార్ వరకు ఫుట్ బాల్ ఆడుతున్నాయి. వాస్తవానికి చిన్న చిన్న జట్లను ఫుట్బాల్ ఆడించడం ద్వారా ఆటకు ఆదరణ పెరిగింది. ఆదాయం కూడా అంతకుమించిన స్థాయిలో వచ్చింది. ఇది ఫిఫా ముందు చూపుకు ఒక బలమైన నిదర్శనం.
ఇలాంటి ముందుచూపు ఐసీసీకి లోపించింది. క్రికెట్ విస్తరణకు చర్యలు తీసుకుంటున్న ఐసీసీ.. క్రికెట్ ఆడే చిన్న జట్లపై మాత్రం వివక్ష చూపిస్తూనే ఉంది. పనికిమాలిన నిర్ణయాలు తీసుకుని.. జట్లపట్ల దారుణంగా ప్రవర్తిస్తోంది. తాజాగా 2027 వన్డే వరల్డ్ కప్ నిర్వహణలో భాగంగా తీసుకొచ్చిన నిబంధనలు చిన్న జట్లకు ప్రతిబంధకం లాగా ఉన్నాయి.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో సూపర్ సిరీస్.. సూపర్ 7 వంటి మార్పులు ఏ మాత్రం ఆమోదయోగింగా లేవు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. 2019.. 2023 వన్డే ప్రపంచ కప్ టోర్నీలలో పది జట్లు పోటీపడ్డాయి. 2027లో మాత్రం ఈ సంఖ్య 14 పెరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వచ్చే వరల్డ్ కప్ లో ఐసీసీ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
గతంలో ఉన్నట్టు కాకుండా సూపర్ సిరీస్.. సూపర్ సెవెన్.. సెమీఫైనల్.. ఫైనల్ మాదిరిగా టోర్నమెంట్ నిర్వహించబోతోంది.. ముఖ్యంగా వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 14 జట్లలో చివరి మూడు జట్లకు రౌండ్ రాబిన్ లీగ్ విధానంలో సూపర్ సిరీస్ పోటీలు నిర్వహిస్తారు. ఈ సిరీస్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు ముందంజ వేస్తుంది. మిగిలిన జట్లు వరల్డ్ కప్ పాడకుండానే ఇంటికి వెళ్లిపోతాయి.
ఈ నిర్ణయాన్ని ఆయా జట్లతో చర్చించకుండానే ఐసీసీ తీసుకుంది. దీనిపై వరల్డ్ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. మెగా టోర్నమెంట్లను నిర్వహించే విషయంలో ఐసీసీకి అధికారం ఉన్నప్పటికీ.. ఇలాంటి మార్పులు చేసేటప్పుడు కచ్చితంగా సంప్రదింపులు నిర్వహించాల్సిన అవసరం ఉందని వరల్డ్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు చెబుతున్నారు.
వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో ప్రధాన జట్లతో పోటీపడాలని చిన్న దేశాల ప్లేయర్లు అనుకుంటారు. అలాంటి ప్లేయర్ల ఆశల మీద ఐసిసి నీళ్లు చల్లింది. కేవలం సూపర్ సిరీస్ వల్ల ఒకే ఒక జట్టు వరల్డ్ కప్ ఆడేందుకు ముందంజ వేస్తుంది. అలాంటప్పుడు ఇన్ని సంవత్సరాలపాటు కష్టపడిన ప్లేయర్ల సంగతేంటి.. వారి కష్టానికి ప్రతిఫలం ఎలా లభిస్తుంది అనే ప్రశ్నలు వ్యక్తం అవుతుంది. క్రికెట్ ను విశ్వ వ్యాప్తం చేయాలని ఐసిసి భావిస్తోంది. కానీ ఇలాంటి నిర్ణయాలు క్రికెట్ విస్తరణకు స్పీడ్ బ్రేకర్లు వేస్తాయి.
ఐసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుతం జై షా కొనసాగుతున్నారు. ఇటీవలి ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలలో పురుష జట్లకు ఇచ్చినట్టుగానే మహిళా జట్లకు ప్రైజ్ మనీ అందించారు. ఈ విషయంలో షా తీరు పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు వరల్డ్ కప్ విషయంలో తీసుకొచ్చిన నిబంధనలు షా పై విమర్శలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటప్పుడు ఈ నిబంధనల విషయంలో షా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.
