Varalakshmi Puja Timings: శ్రావణ మాసంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంను ఈ ఏడాది ఆగస్టు 21న జరుపుకొనున్నారు. అయితే ఇప్పటికే మహిళలు ఈ వ్రతం కు కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకుంటున్నారు. అయితే వరలక్ష్మీ వ్రతం లో భాగంగా ఏ సమయంలో పూజలు చేయాలి? ఎలాంటి పూజలు చేస్తే సరైన ఫలితాలు ఉంటాయి? అన్న సందేహం కొంతమందిలో ఉంది. ఆ వివరాలు లోకి వెళ్తే..
కొందరు పండితులు తెలుపుతున్న ప్రకారం వరలక్ష్మి వ్రతం పూజను సరైన సమయంలో నిర్వహించాలని అంటున్నారు. వరలక్ష్మి వ్రతంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభించాలని.. మధ్యాహ్నం లోపే పూజ ముగించాలని అంటున్నారు. ఇందులో భాగంగా పూజ నిర్వహించడానికి ఉదయం 6.10 గంటల నుంచి 8.28 వరకు అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 5.30 గంటల నుంచి ఏడు గంటల వరకు నిర్వహించుకోవచ్చు అని అంటున్నారు. ఈరోజున రాహుకాలం 10.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.19 వరకు ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే యమగండం మధ్యాహ్నం 3.28 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఉందన్నారు. అయితే అర్ధరాత్రి 11.20 గంటల నుంచి 01:15 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో పూజలు చేయరాదని చెబుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం ఆచరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పూజకు కావలసిన వస్తువులను సిద్ధం చేసుకుని.. పూజ మందిరాన్ని అలంకరించుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి విగ్రహ లేదా చిత్రపట ప్రతిష్టాపనకు పీఠం ఏర్పాటు చేసుకొని కలశంను ఉంచాలి. కుంకుమ, పసుపుతో అలంకరించి పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తరం, ఇతర స్తోత్రాలు చదవాలి. చివరగా వరలక్ష్మి వ్రత కథను వినాలి.
వరలక్ష్మీ వ్రతం రోజున ఉపవాసం ఉండడం చాలా మంచిది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవచ్చని పండితులు తెలుపుతున్నారు. వ్రతం పూర్తయిన తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఆహారం తీసుకోవచ్చని అంటున్నారు. పూజలో నైవేద్యానికి పిండివంటలు, పాయసం, పులిహోర ఏర్పాటు చేసుకోవచ్చు.
వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల కుటుంబ శ్రేయస్సు ఉండడమే కాకుండా దీర్ఘాయుష్షు కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. అయితే నియమనిష్ఠలతో.. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని అనుకునేవారు మాత్రమే వ్రతం ఆచరించాలని కొందరు చెబుతున్నారు.