Varalakshmi Vratam Rules: శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు నిర్వహించే వరలక్ష్మీ వ్రతం ను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉంటారు. ఈరోజున ఉపవాసాలు ఉండి మహాలక్ష్మి అమ్మవారిని కొలుస్తూ.. తోటి మహిళలకు వాయినాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే ఈ వ్రతం నిర్వహించేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజున ఇంట్లో వండే ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
వరలక్ష్మీ వ్రతం నిర్వహించే ఇంట్లో ఈరోజు ఆహారం వండే పదార్థాల్లో ఉల్లి, వెల్లుల్లి వేయకుండా ఉండాలని కొందరు పండితులు చెబుతున్నారు. ఈ పదార్థాలను రాజసిక లేదా తామసిక ఆహారాలుగా భావిస్తారు. వీటిని వ్రతం రోజున ఆహార పదార్థాల్లో వేస్తే మానసికంగా, శారీరకంగా ఉత్తేజాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అయితే వరలక్ష్మీ వ్రతం రోజున మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఈ పదార్థాలను దూరంగా ఉంచడమే మంచిదని పండితులు చెబుతున్నారు.
వరలక్ష్మీ వ్రతం రోజున మాంసాహారం తినకుండా ఉండడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందుతారని చెబుతున్నారు. ఈరోజు వీటిని తీసుకోవడం వల్ల మనసు తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలని కొందరు సూచిస్తున్నారు. అమ్మవారిని కొలిచే వారు తమ మనసు పక్కదారి పట్టకుండా ఉండేందుకు.. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనేందుకు ఈ నియమం పాటించాలని చెబుతున్నారు.
అలాగే వరలక్ష్మీ వ్రతం రోజున ఇతరులతో కఠినంగా కాకుండా మంచి మనసుతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. గొడవలకు, ద్వేషానికి పోకుండా.. ఇతరులపై అసూయ కలగకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులతో కఠినంగా మాట్లాడడం వల్ల మనసు తప్పుదారి కి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు గోర్లు, జుట్టు కూడా కత్తరించుకోకుండా ఉండాలని కొందరు నియమం చెబుతున్నారు.
అయితే వరలక్ష్మీ వ్రతం నిర్వహించేవారు శారీరక, మానసిక ప్రశాంతత కోసం సాత్వికమైన ఆహారం తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపవాసం ఉన్నవారు పండ్లు, పాలు, పెరుగుతోపాటు నైవేద్యాలను తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా ఉండవని అంటున్నారు. అయితే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలని అంటున్నారు. ఇవే కాకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం.. శుభ్రంగా ఉండే దుస్తులను ధరించడం వంటివి కూడా చేయడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చని అంటున్నారు.