రాజ్యసభ ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలలో ఈ పదవి ఆశిస్తున్న వారిలో కదలిక ప్రారంభమైనది. ఆంధ్ర ప్రదేశ్ నుండి నాలుగు, తెలంగాణ నుండి రెండు స్థానాలకు జరిగే ఎన్నికలలో అన్ని స్థానాలను అధికార పక్షాలే గెలుచుకోగలవు.
ఒక వంక తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో ఓటమి చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను రాజ్యసభకు పంపే అంశంపై ఊహాగానాలు జరుగుతున్నా ఇప్పటివరకు నిర్దుష్టమైన సంకేతాలు వెలువడలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వై ఎస్ షర్మిలను రాజ్యసభకు పంపడం గురించి సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి.
2014లో కడప నుండి, 2019లో ఒంగోలు లేదా విశాఖపట్నంల నుండి లోక్ సభకు పోటీ చేయాలని ఆమె ఎంతగా ప్రయత్నించినా జగన్ ఒప్పుకోలేదు. కడప నుండి తమ కుటుంభంకు చెందిన అవినాష్ రెడ్డికి అవకాశం ఇస్తూ వస్తున్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత ఒక విధంగా షర్మిల ప్రభుత్వానికి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
2014లో నరసరావుపేట నుండి పోటీ చేసి ఓటమి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అయోధ్యరామి రెడ్డికి సీట్ ఇస్తున్నట్లు కూడా కధనాలు వెలువడ్డాయి. అయితే అకస్మాత్తుగా ఇప్పుడు షర్మిల పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరింప చేసుకొంది.
న్యాయసంబంధంగా అనూహ్య పరిణామాలు జరిగి, జగన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తే తమ కుటుంబంలోనే అధికారం కోసం కుమ్ములాటలు ఏర్పడకుండా నివారించడం కోసం ఆమెను రాజ్యసభకు పంపాలని జగన్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా తాను రాజీనామా చేయవలసి వస్తే ముఖ్యమంత్రిగా భార్య వై ఎస్ భారతిని చేయడానికి అడ్డు లేకుండా చేసే ప్రయత్నం చేసారని చెబుతున్నారు.
షర్మిలను రాజ్యసభకు పంపితే రెడ్డి సామజిక వర్గం నుండి మరొకరికి అవకాశం లభించే పరిష్టితి ఏర్పడదు. శాసన మండలి రద్దు చేయాలని అనుకోవడంలో ప్రస్తుతం మంత్రి పదవులలో ఉన్న ఇద్దరు ఎమ్యెల్సీలు – పి సుభాష్ చంద్ర బోస్, ఎం వి రమణారావు లలో ఒకరిని రాజ్యసభకు పంపనున్నట్లు ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఈ సందర్భంగా రమణారావు పేరు వినిపిస్తున్నది.