Sharmila: కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు షాక్ ఇచ్చింది. రాజ్యసభ పదవి విషయంలో మొండి చేయి చూపింది. కర్ణాటకలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ పదవుల్లో ఒకటి షర్మిల కు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచి మరి ఈ విషయాన్ని చెప్పారు. కానీ కర్ణాటకలో రాజకీయ పరిణామాలు తో స్థానికులకే ఆ పదవులు కేటాయించాల్సి వచ్చింది. హై కమాండ్ కోటాలో కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ పవన్ ఖేరాకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. దీంతో షర్మిలకు షాక్ తగిలినట్లు అయింది. అయితే కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు మరో షాక్ ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* అప్పట్లోనే హామీ
తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల అనుకున్న స్థాయిలో రాణించకపోయేసరికి పునరాలోచనలో పడ్డారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ అధినాయకత్వం ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే రాజ్యసభ పదవి ఇస్తామని ఆఫర్ చేసింది. అందుకు తగ్గట్టుగానే షర్మిల అడుగులు వేశారు. కానీ ఇప్పుడు కర్ణాటక ద్వారా రాజ్యసభ పదవి భర్తీ చేశారు కానీ.. షర్మిలకు అవకాశం ఇవ్వలేదు. ఇస్తున్నట్టు చెప్పి మరి తప్పించారు. దీంతో షర్మిల తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె అనుచరులు సైతం తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
* పిసిసి చీఫ్ మార్పు..
మరోవైపు పీసీసీ చీఫ్ పదవి నుంచి సైతం షర్మిలను తప్పిస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఆమె స్థానంలో కేంద్ర మాజీ మంత్రి, బీసీ మహిళ కిల్లి కృపారాణి నియమిస్తారని టాక్ నడుస్తోంది. కృపారాణి సీనియర్ నాయకురాలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేసారు. ఆమెకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆమెకు అనుభవం కూడా ఉంది. ఆపై కాంగ్రెస్ దేశంలో పుంజుకుంటుందన్న అభిప్రాయం ఉంది. షర్మిలను జాతీయ కాంగ్రెస్ లోకి తీసుకుంటారని.. ఏఐసీసీ ద్వారా సేవలు వినియోగించుకుంటారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
