యస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో భారతీయ రిజర్వు బ్యాంక్ రంగంలోకి దిగింది. యస్ బ్యాంక్ కార్యకలాపాలపై ఆంక్షలు విధించింది. ఈ బ్యాంకు బోర్డును ఆర్బీఐ 30రోజులపాటు సస్పెండ్ చేసింది. విత్ డ్రాలను 50వేలకు మించి చేయరాదని ఆంక్షలు ఉండటంతో ఈ బ్యాంకులు డబ్బులు దాచుకున్న ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రయివేట్ బ్యాంక్ కావడం, వడ్డీలు ఎక్కువగా ఇస్తుండటం, మనీ దాచుకున్న వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో యస్ బ్యాంకులో ఇబ్బడిముబ్బడిగా ఖతాదారులు పెరిగిపోయారు. ఇందులో ఎక్కవుగా సెలబ్రెటీలు, ధనవంతులకు చెందిన వారి ఖాతాలే ఎక్కువగా ఉండటం విశేషం.
యస్ బ్యాంకులో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో రాణా కపూర్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా రాణా కపూర్ కు చెందిన రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ చిత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుందని సమాచారం. 2010సంవత్సరంలో రాజీవ్ గాంధీ చిత్రాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన చేత బలవంతంగా 2కోట్లకు విక్రయించారని ఈడీకి స్టేట్ మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాటి యూపీయే ప్రభుత్వం తనపై ఒత్తిడితోనే తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఈ చిత్రాలను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పినట్లు సమాచారం.
రాజీవ్ గాంధీ పెయింటింగ్ను ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రీకరించారు. కాంగ్రెస్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దీనిని 1985లో రాజీవ్ గాంధీకి ఎం.ఎస్. హుస్సేన్ బహూకరించారు. ఈ పెయింటింగ్ నే యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ 2010లో కొనుగోలు చేశారు. తాజా బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో రాజీవ్ గాంధీ పెయిటింగ్ వ్యవహారం బయటికి వచ్చింది. తనకు ఇష్టంలేకుండా బలవంతంగా ప్రియాంక గాంధీ విక్రయించారని రాణా కపూర్ చెప్పడంతో ఈ వ్యవహారం కాస్తా రాజకీయంగా దూమారం రేపుతోంది. ఇప్పటికే ఈ బ్యాంక్ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ఎగవేసిన వ్యవహారంలో అనిల్ అంబానీ, ఎస్ఎల్ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహరంలోకి ప్రియాంక గాంధీ పేరుచేర్చడంతో ఇది రాజకీయరంగు పులుముకుంటుంది.
ఇదిలా ఉండగా మరో వారం రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటాయని బ్యాంక్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఖాతాదారులు తమ సొమ్మును విత్డ్రా చేసుకోవడంపై విధించిన ఆంక్షలను కూడా త్వరలోనే తొలిగిపోతాయని చెబుతున్నారు. ఇప్పటికే యస్ బ్యాంక్ పై ఆంక్షల నేపథ్యంలో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాతాదారుల మనీకి కేంద్రం ప్రభుత్వం పూచీకత్తుగా ఉంటామని ప్రకటిస్తున్నప్పటికీ ఖాతాదారులు మాత్రం బెంబేలెత్తిపోతున్నారు. యస్ బ్యాంక్ వ్యవహారం రోజురోజుకు ఓ కీలక మలుపు తిరుగుతుండటం ఆసక్తిని రేపుతోంది.