ప్రాణం విలువ వెలకట్టలేం. ఒక్కసారి పోతే మళ్లీ తిరిగి రాబట్టలేం.. రోజురోజుకు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మనవ ప్రమేయాన్ని తగ్గించి యంత్రాలతో పనులు కానిచ్చేలా పరిశోధనలు తీవ్రమవుతున్నాయి.. యుద్ధాల్లో, పోరాటాల్లో మనుషుల ప్రాణాలు పోకుండా శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. అందులో భాగంగా మనుషులతో పనిలేని క్షిపణులు, పైలెట్ రహిత విమానాలు తయారు చేస్తూ ప్రపంచానికి అమెరికా, జపాన్ సహా పలు పాశ్చాత్య దేశాలు పెనుసవాల్ విసురుతున్నాయి.ఈ మర యంత్రాల వల్ల మనుషులతో చేయాల్సిన పనులు వాటితో చేసేయొచ్చు..
టెక్నాలజీతో అన్ని ఇప్పుడు యంత్రాలనే తయారు చేస్తున్నారు. వీటి వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు తప్పుతుంది. అదే సమయంలో యంత్రాలు చేసే విధ్వంసం మాత్రం ఊహకు అందనిది.. ఈ పరిణామాలతో ప్రపంచానికే ముప్పు అంటున్నారు శాస్త్రవేత్తలు.. ఈ యాంత్రిక అస్త్రాలే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకు వరంలా మారాయి. పైలెట్ రహిత విమానాలు, సొంతంగా దూసుకుపోయే క్షిపణులు కొన్ని దేశాల్లో రహస్యంగా తయారు చేస్తున్నారని తాజాగా పరిశోధన ఒకటి వెల్లడించింది. అవి ఎలా తయారు చేస్తున్నారో కూడా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
సాధారణ విమానాల్లోను, రాకెట్లలోను అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్లు ఉంటాయి. వాటి మెమొరీలో ముందుగానే వివిధ విమానాశ్రయాలు, చేరవలసిన లక్ష్యాలను ఈ ఊహాయుత రేఖలను ఆధారంగా గుర్తించి ఆ సమాచారాన్ని ఫీడ్ చేసి డేటాబేస్గా ఉంచుతారు. పైలట్ ఉండే విమానాల్లో సైతం ఆ విమానం ఏ దిశలో, ఎంత ఎత్తులో, ఎంత వేగంతో ప్రయాణించాలో కంప్యూటర్లతో అనుసంధానమైన వ్యవస్థే చెబుతుంది.
పైలట్ లేని విమానాలు, క్షిపణుల విషయంలో అవి ప్రయాణించాల్సిన మార్గం మొత్తాన్ని కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఆయా విమానాల గమనాన్ని కంప్యూటర్లు, భూమ్మీద ఉండే నియంత్రణ వ్యవస్థలే నియంత్రిస్తూ ఉంటాయి. ఇదంతా ఆధునిక సాంకేతిక విజ్ఞానం చేసే మాయాజాలం. దీంతో మనుషుల ప్రమేయం లేకుండా.. మనుషుల ప్రాణం పోకుండా యుద్ధాలు చేసే రోజులు తొందరలోనే ఉన్నాయి. ఇదే జరిగితే పైలెట్ రహిత విమానాలు, మానవ ప్రమేయం లేని క్షిపణులతో ప్రపంచ మానవాళికే పెనుముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా మానవ ప్రమేయం లేని యంత్రాలు, టెక్నాలజీతో మానవ మనుగడకే ప్రమాదం అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలవడుతున్నాయి.