దేశంలో గత కొన్ని రోజులుగా వంటనూనెల ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. వంటనూనె ధరలు తగ్గించాలని సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వంట నూనె ధరలు తగ్గనున్నాయి. ట్రేడర్లతోపాటు వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరేలా వంటనూనె విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.
మోదీ సర్కార్ ఆల్ ఇండియా ఎడిబుల్ ఆయిల్ ట్రేడర్స్ ఫెడరేషన్ డిమాండ్ కు ఓకే చెప్పింది. ఇకపై దేశంలోని వంటనూనెలకు బీటీటీటీ టెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. మన దేశీ నూనెలు అన్ని పరీక్షలు పాస్ అయినా బీటీటీటీ పరీక్షలో మాత్రం ఫెయిల్ అయ్యేవి. ఫలితంగా దేశీయంగా తయారయ్యే నూనెలపై ప్రతికూల ప్రభావం పడి దేశీనూనెలు విక్రయించే వ్యాపారులకు ఇబ్బందులు ఎదురయ్యేవి.
ట్రేడర్లు సైతం బీటీటీటీ టెస్ట్ లో ఫెయిల్ అయిన నూనెలను విక్రయించడానికి ఆసక్తి చూపేవాళ్లు కాదు. ఫలితంగా వంటనూనెల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. అయితే కేంద్రం దేశీ వంటనూనెలకు బీటీటీటీ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో మన దేశంలో వంటనూనెల ఉత్పత్తి పెరగడంతో పాటు ధరలు తగ్గే అవకాశాలు ఉంటాయి.
ఇకపై ట్రేడర్లు వంటనూనెలు బీటీటీటీ టెస్ట్ పాస్ అయినా కాకపోయినా విక్రయించే అవకాశం ఉండటంతో వంటనూనెల ఉత్పత్తి పెరగడంతో పాటు ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం కేంద్రం అమలు చేస్తున్న నిబంధనలు చాలా పాతవని నిబంధనలలో కీలక మార్పులు చేయాలని వ్యాపారులు చెబుతున్నారు.