Homeఆంధ్రప్రదేశ్‌AP Employees : ఏపీ పీఆర్సీ వివాదం సమాప్తం.. సమ్మె విరమించిన ఉద్యోగ సంఘాలు.. జగన్...

AP Employees : ఏపీ పీఆర్సీ వివాదం సమాప్తం.. సమ్మె విరమించిన ఉద్యోగ సంఘాలు.. జగన్ సర్కార్ గొప్ప ఊరట

AP Employees :  ఏపీలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలగినట్లయింది. మొన్నటి వరకు రోడ్లపై ఆందోళన చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులు ఇక తమ విధుల్లోకి వెళ్లనున్నారు..! పీఆర్సీ విషయంలో ఉద్యోగులను సంతృప్తిపరిచేందుకు కొన్ని విషయాల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో సంఘాల నాయకులు తమ ఆందోళనను విరమించుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు ఉమ్మడిగా సమావేశం నిర్వహించి శనివారం రాత్రి ప్రకటించాయి. అయితే ఫిట్మెంట్ పెంచకపోయినా హెచ్ఆర్ఏ స్లాబుల్లో మార్పులు చేయడంతో ఉద్యోగులు శాంతించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని తమ ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.

జనవరి 27 11వ పీఆర్సీని సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదలను పెట్టింది. ఇందులో భాగంగా గత నె 6,7 తేదీల్లో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో సీఎం జగన్ దీనిపై చర్చించారు. మొత్తంగా 23.29 ఫిట్మెంట్ పెంచేందుకు అంగీకారం తెలిపారు. అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచారు. 2020 ఏప్రిల్ నుంచి పీఆర్సీ అమలు చేస్తూ 2022 జనవరి వేతనాల్లో వాటిని చెల్లించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. 2018 నాటి పీఆర్సీ అమలులో భాగంగా ఆ సమయంలో 27 శాతం ఐఆర్ నిర్ణయించింది. కాని ఈనెల 17న ప్రకటించిన పీఆర్సీలో దీనిని 23.29శాతంగా తగ్గించారు. దీంతో ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా ఉద్యోగులు తీసుకునే జీతాల్లో 3.71 శాతం వేతనం తగ్గుతుందని ఉద్యోగులు ఆందోళన చేశారు.

మరోవైపు హెచ్ ఆర్ లను కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పటి వరకు 20 శాతం ఉన్నవారికి 16 శాతం…14.5 శాతం ఉన్న వారికి 8 శాతం…12 శాతం ఉన్న వారికి 8 శాతంగా తగ్గించారు. అంటే అంతకుముందు ప్రాంతాలను భట్టి హెచ్ ఆర్ ఇవ్వగా.. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన చూపుతూ లెక్కగడుతున్నారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం సిటీల్లో చేసినా అక్కడి జనాభాను భట్టి చూస్తే 8 శాతం హెచ్ ఆర్ తగ్గే అవకాశం ఉందని అన్నారు. అలాగే 70 ఏళ్ల పై బడిన పెన్షన్ దారులకు చెల్లించే అదనపు పెన్షన్, నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చే సీసీఏ వంటి అంశాలు కూడా ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిల్చాయి.

ఈమేరకు జనవరి 18న ఉపాధ్యాయ సంఘాలు కలెక్టరేట్లను ముట్టడించారు. ఆ తరువాత ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఏకమయ్యాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో రిలే దీక్షలకు పూనుకున్నారు. ఇక తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఈనెల 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఈ ఆందోళన కార్యక్రమాన్ని ఎంత కట్టడి చేసినా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉవ్వెత్తున్న తరలివచ్చారు. అంతేకాకుండా పెన్ డౌన్, సమ్మె వంటివి ప్రకటించడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది.

ప్రభుత్వం తరుపున సంప్రదింపుల కమిటీని వేశారు. ఇందులో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రప్రసాద్, పేర్ని నానిలతో పాటు ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ లు ఉన్నారు. వీరు ఉద్యోగ సంఘాల నాయకులతో శనివారం సుధీర్ఘంగా చర్చలు జరిపారు. దాదాపు 7 గంటల పాటు జరిగిన చర్చల్లో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఫిట్మెంట్ 23 శాతమే ఇస్తామని, హెచ్ ఆర్ ఏ శ్లాబులు పెంచేందుకు అంగీకరించారు. అలాగే పదేళ్ల పీఆర్సీ సవరణను ఐదేళ్లకు తగ్గించడంతో ఉద్యోగులు శాంతించారు. దీంతో ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపట్టాల్సిన సమ్మెను వాయిదా వేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular