spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Andhrajyothy : డిజిటల్ "దిశ"వైపు ఆంధ్రజ్యోతి.. త్వరలో డైనమిక్ ఎడిషన్లు

Andhrajyothy : డిజిటల్ “దిశ”వైపు ఆంధ్రజ్యోతి.. త్వరలో డైనమిక్ ఎడిషన్లు

Andhrajyothy : గతమెంతో ఘనం.. నేడు అత్యంత అధ్వానం.. ఈ సామెత ఇప్పుడు ముద్రణ మాధ్యమానికి ఆపాదించాల్సి ఉంటుంది.. కంటే ముద్రణ వ్యయం పెరిగిపోయింది. జీతభత్యాల భారం అంతకంతకు ఎక్కువవుతున్నది. రవాణా ఖర్చు, పంపిణీ వ్యయం తడిసి మోపెడవుతున్నది. ఏవో రాజకీయ అవసరాలు ఉన్నవాళ్ళు తప్ప కమర్షియల్ కోణంలో ఎవరూ కొత్తగా ప్రింట్ జోలికి వెళ్లే అవకాశాలు లేవు.. బహుశా ఈ ప్రింట్ మీడియాలో వెలుగు తప్ప ఇంతవరకు కొత్తగా ఎవరూ ఇందులోకి ఎంటర్ కాలేదు. ఇకపై వచ్చే అవకాశాలు కూడా లేవు. పైగా పేపర్ కొని చదివే వాళ్ళ సంఖ్య కూడా వేగంగా పడిపోతుంది.

-టెక్నాలజీ దెబ్బకు..

సాంకేతిక పరిజ్ఞానం దెబ్బకు ముద్రణ మాధ్యమం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొచ్చుకు రావడంతో మీడియాలో పరిస్థితి వేగంగా మారిపోతున్నది. ప్రతి నిమిషం వార్తల్ని అప్డేట్ చేసే సైట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమైన వార్తలను మొబైల్ ఫోన్లో చదువుకోవడం అలవాటైపోతోంది. ఇక రాను రాను పాచిపోయిన వార్తల్ని తెల్లారి పత్రిక కొన్ని చదివేవాడు ఎవడుంటాడు. పైగా పాత్రికేయంలో నాణ్యత నేతి బీర చందమవుతున్నది. ఒక్కటంటే ఒక్కటీ రీడబుల్ వార్త ఉండటం లేదు. ఇక తెలుగులో అయితే మరీ. మొన్నటి ఏ బి సి సర్కులేషన్ లెక్కలు తీస్తే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలదీ నేల చూపే. ఈనాడు ప్రింట్ కొనసాగింపునకు కిందా మీదా పడుతోంది. యాడ్స్ టారిఫ్ అడ్డగోలుగా తగ్గించింది. జమా ఖర్చుల మధ్య తేడాను పూడ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. మొత్తం ప్రింటింగ్ యూనిట్లు మూసి పారేసి, జిల్లాల్లో ఆఫీస్ యూనిట్లు షట్ డౌన్ చేసి, కేవలం రామోజీ ఫిలిం సిటీ ఆఫీస్ మాత్రమే కొనసాగించి, ఇకపై డిజిటల్ ఎడిషన్, ఈటీవీ భారత్ పై మాత్రమే దృష్టి పెట్టాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నది. కానీ దానికి అది సాధ్యం కావడం లేదు..

-డబ్బులు పెట్టే వారు ఉన్నారు

సాక్షికి, నమస్తే తెలంగాణకు డబ్బులు పెట్టేవారు ఉన్నారు.. వాటి యజమానులకు రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి తప్పదు. అధికారంలో ఉన్నప్పటికీ జీతాల పెంపుదల కోసం మొన్నటిదాకా ఆ నమస్తే తెలంగాణ సబ్ ఎడిటర్లు ఆందోళన చేశారు కూడా. ఈ స్థితిలో ఆంధ్రజ్యోతి ప్రింట్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, డిజిటల్ ఎడిషన్ లపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తోంది. పైన చెప్పుకున్న పేపర్లన్నింటికీ వెబ్సైట్లు, e- పేపర్లు ఉన్నాయి. పలు ఇంగ్లీష్ పత్రికలు ప్రింట్ యూనిట్లను మూసేసి, డిజిటల్ ఎడిషన్లనే నడిపిస్తున్నాయి.. వెబ్సైట్లు ప్లస్ ఈ_ పేపర్లు. ఆ డిజిటల్ పేపర్లకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నాయి. కొన్ని వెబ్సైట్ లలో ఎక్స్ క్లూజివ్ వార్తలకు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి. సో, ఆంధ్రజ్యోతి కూడా అదే బాట పట్టబోతోంది. తొలి దశలో హైదరాబాద్, వరంగల్ ఎడిషన్లకు సంబంధించి ప్రయోగం చేయబోతున్నారు. ఈ దిశలో వరంగల్లో ఒక సన్నాహక సమావేశం కూడా జరిగింది.. అయితే దీనిపై మెజారిటీ సబ్ ఎడిటర్లు పెదవి విరిచినట్టు సమాచారం.

-దిశ బాటలో..

దిశ అనే పత్రిక ఈ డిజిటల్ మాధ్యమానికి సరికొత్త దారులుపరిచింది. దానికి వెబ్సైట్ ఉంది.. ఈ పేపర్ కూడా ఉంది. అదనంగా డైనమిక్ ఎడిషన్ పేరిట రోజుకు మూడుసార్లు అవసరాన్ని బట్టి వార్తల్ని ఒక పేజీలో పెట్టేస్తుంది.. ఇక ఆంధ్రజ్యోతి కూడా రోజూ రెండు లేదా మూడు డైనమిక్ ఎడిషన్స్ రిలీజ్ చేయనుంది.. డైనమిక్ ఎడిషన్లో బైక్ ఢీకొని వ్యక్తి మృతి వార్తను, ఫలానా రాష్ట్రంలో కూలిన ప్రభుత్వం, సిరియాలో 70 వేల మందిని మింగిన భూకంపం అనే వార్తలను కూడా సేమ్ పక్కపక్కనే అవే ప్రాధాన్యంతో చదువుకోవాల్సి వస్తోంది. ఈ_ పేపర్ అయితే వార్తను బట్టి ప్రజెంటేషన్, పేజినేషన్ చూపించవచ్చు.. అయితే ఆంధ్రజ్యోతి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో తెలియదు. ఒకవేళ డిజిటల్ ఎడిషన్ లో మొదలైతే కానీ అది ఎలాంటి ప్రయోగాలు చేయబోతుందో ఒక అంచనా ఏర్పడుతుంది.. ఇక సాక్షి కూడా త్వరలో డిజిటల్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. ఎందుకంటే అది జగన్ కు ఎప్పుడూ ఉపయోగపడదు కాబట్టి. జగన్ కూడా దాన్ని పట్టించుకోవడం మానేసాడు గనుక.. ఇక నమస్తే తెలంగాణ అది గాలికి పేలిపోయే బుడగ. రేపటి నాడు కెసిఆర్ అధికారం కోల్పోతే దాని పరిస్థితి ఏంటో తెలియదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular