TANA: అమెరికాలో తెలుగు భాషా పరిరక్షణ, అభివృద్ధి లక్ష్యంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతీ ఏటా పాఠశాల తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అస్టిన్లో తెలుగు పాఠశాల తరగతులు 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. ఇటీవల ఘనంగా ప్రారంభమైన ఈ తరగతులు విద్యార్థుల ప్రదర్శనలతో, ప్రార్థనలతో ఆరంభమయ్యాయి.

ఈ సందర్భంగా పాఠశాలకు జాతీయ స్థాయిలో కో-చైర్పర్సన్గా ఉన్న ఉపాధ్యాయురాలు రజని మారం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. గత రెండు సంవత్సరాలుగా పాటన్ ఎలిమెంటరీ స్కూల్లోని ఆస్టిన్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (ఎఐఎస్డీ)లో తరగతులను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా మరింత విస్తృతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు పాఠశాలలో చేర్పించి మాతృభాషా అభివృద్ధికి తోడ్పడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే ఉపాధ్యాయులు వాసవి, శ్వేత, రాజేష్, అనుషలను అందరికీ పరిచయం చేశారు.

కార్యక్రమంలో తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, కోశాధికారి రాజా కసుకుర్తి, పాఠశాల చైర్ భాను మాగులూరి పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. అదే రోజు నమోదైన విద్యార్థులకు పుస్తకాలు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.

తెలుగు ఉచ్చారణ తరగతులతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు, సంఘానికి చెందిన పలువురు హాజరై ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. చివరగా రజని మారం హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.
అస్టిన్లో తానా తెలుగు పాఠశాల ప్రారంభం చిన్నారుల మాతృభాషా అభ్యాసానికి కొత్త ఉత్సాహం నింపిందని అక్కడి తెలుగు సమాజం ఆనందం వ్యక్తం చేస్తోంది.