Homeఅత్యంత ప్రజాదరణతిరుపతి బరి: గెలిచే సత్తా ఎవరికుంది?

తిరుపతి బరి: గెలిచే సత్తా ఎవరికుంది?

Tirupati By-election

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ ఏర్పాటయ్యాక.. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే రాజ్యమేలుతున్నాయి. రోజులు గడుస్తున్న కొలదీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి తెలంగాణలో ఖతమైందనే చెప్పాలి. ఏపీలో టీడీపీ కొంత మెత్తపడడంతో ఆ ప్లేస్‌ను కొట్టేయాలని బీజేపీ ఉవ్విల్లూరుతోంది.

ఏ రాష్ట్ర రాజకీయాలు ఆ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ.. ఇక్కడ ఇరు రాష్ట్రాల్లోనే బీజేపీ కామన్‌ పార్టీ అయింది. మొన్నటికి మొన్న దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు బావుటా ఎగురవేసింది. ఎవరూ ఊహించని విధంగా అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చింది. గులాబీ బాస్‌ నుంచి కింది స్థాయి క్యాడర్‌‌ వరకు ఆ ఓటమిని ఎవరూ భరించలేకపోయారు. ముందు నుంచి బీజేపీని టీఆర్‌‌ఎస్‌ పార్టీ లైట్‌ తీసుకుంది. ఆ పట్టింపులేనితత్వమే పెద్ద దెబ్బ కొట్టింది. లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్పిన గులాబీ నేతలంతా ఒక్కసారిగా తోకముడిచారు.

Also Read: తిరుపతి ఉపఎన్నిక: అగమ్యగోచరంగా పవన్‌ కళ్యాణ్ పరిస్థితి

అయితే.. ఇప్పుడు దుబ్బాక ఫలితంతో.. అదే ఊపుతో గ్రేటర్‌‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తలపడుతోంది బీజేపీ. టీఆర్‌‌ఎస్‌ వైఫల్యాలను.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తూ సక్సెస్‌ కాగలుగుతోంది. మరోవైపు టీఆర్‌‌ఎస్‌ పొలిటికల్‌ స్టంట్‌కు ఎక్కడా చిక్కకుండా తన దైన శైలిలో దూసుకెళ్తోంది. దీంతో ఇప్పుడు గ్రేటర్‌‌ రాజకీయాలు ఒక్కసారిగా హాట్‌హాట్‌గా మారిపోయాయి.

మరికొద్ది రోజుల్లో ఏపీలో తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఆ స్థానాన్ని కూడా బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే.. ఇక్కడ కూడా జగన్‌ బీజేపీని లైట్‌ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కనీసం దానిని రాజకీయ ప్రత్యర్థిగా కూడా చూడడం లేదు. దీంతో ఆ ఉప ఎన్నికలో జగన్‌కు బీజేపీ ఝలక్‌ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక గడువు ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో మూడు పార్లమెంట్‌ స్థానాల ఉప ఎన్నికలనూ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కర్ణాటకలోని బెల్గాం, తమిళనాడులోని కన్యాకుమారి, ఏపీలోని తిరుపతి లోక్‌సభ స్థానాలకు అతి త్వరలోనే షెడ్యూల్‌ విడుదల కానుంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఎదుర్కోబోతున్న ఉప ఎన్నిక ఇది. దీంతో అందరూ ఈ ఉప ఎన్నిక మీదనే దృష్టి సారించారు. టీడీపీ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థిగా ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తి పేరును లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది.

ఇక జనసేన చీఫ్‌ మాత్రం ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం తామే తిరుపతి బరిలో నిలుస్తామంటూ బీరాలు పలుకుతోంది. ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్‌ ఆఫీసర్‌‌ దాసరి శ్రీనివాసులును బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. చాలాకాలంగా దాసరి బీజేపీలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. అందుకే.. ఆయన పేరును ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది.

Also Read: కేసీఆర్‌‌ వెనక్కి తగ్గినట్లేనా?

గత లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జనసేనలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు తిరుపతి స్థానంపై అటు బీజేపీ.. ఇటు జనసేనలు ఆశలు పెట్టుకున్నాయి. పైగా తమ పార్టీకే టికెట్‌ కేటాయించాలంటూ పవన్‌ ఏకంగా ఢిల్లీ బాట పట్టారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇంతో అంతో బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. సరే అక్కడ మంచి పోటీని ఇస్తోందని అనుకుందాం. కానీ.. ఏపీలో ఏమాత్రం గ్రాఫ్‌ పెరగని బీజేపీ ఇక్కడ పోటీ కోసం ఎందుకు పాకులాడుతోందో తెలియకుండా ఉంది.

మరోవైపు.. టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పేరును ప్రకటించి పది రోజులైనా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాను బీజేపీలో చేరాలనుకుంటుండగా.. కనీసం మాటైన చెప్పకుండా టీడీపీ టికెట్‌ ఖరారు చేసిందని ఆమె తన సన్నిహితుల దగ్గర వాపోయినట్లు సమాచారం. పనబాకతో మాట్లాడేందుకు అధినేత చంద్రబాబు.. సోమిరెడ్డిని రంగంలోకి దింపారు. అయితే.. ఆమె కొన్ని డిమాండ్లను హైకమాండ్‌ దగ్గర పెట్టారని.. వాటిని ఆమోదించుడా.. లేదా అనే సందిగ్ధంలో చంద్రబాబు ఉన్నారని సమాచారం.

మరికొద్ది రోజుల్లో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉండడంతో కీలక నేతలంతా అక్కడే మకాం వేశారు. టీడీపీ అసంతృప్తులకు ఇప్పటి నుంచే గాలం వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అత్యంత సన్నిహితుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన విష్ణుకుమార్‌‌ రెడ్డి కొద్ది రోజులుగా తిరుపతిలోనే మకాం వేశారు. టీడీపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి.. ఇప్పుడు సైలెంట్‌ అయిన నేతలను టార్గెట్‌ చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసిన నేతలతో విష్ణు వరుస మంతనాలు సాగిస్తున్నట్లుఆ తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఇదిలా ఉంటే.. తిరుపతి లోక్‌సభ సీటు చాలాకాలంగా నాన్‌ లోకల్స్‌కు కేరాఫ్‌ అయింది. దివంగత బల్లి దుర్గాప్రసాద్‌, అంతకుముందు ఎంపీ వరప్రసాద్‌ ఇద్దరూ నెల్లూరు జిల్లావాసులే. అయితే.. టీడీపీ కూడా ఈ ఎన్నికలో కంప్రమైజ్‌ అయి బీజేపీకి మద్దతు ఇస్తే ఈసారి పోటీ డాక్టర్‌‌ వర్సెస్‌ మాజీ ఐఏఎస్‌ అన్నట్లుగా ఉండబోతోంది. వైసీపీ ప్రాబబుల్‌ గురుమూర్తి స్వస్థలం తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో భాగమైన శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఏర్పేడు మండలం మన్న సముద్రం ప్రాంతానికి చెందిన స్థానికుడు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి. తిరుపతి స్విమ్స్‌లో ఫిజియోథెరపీ పూర్తిచేసిన గురుమూర్తి స్థానికంగానే ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. ఇక బీజేపీ ప్రాబబుల్‌ దాసరి శ్రీనివాసులు తిరుపతిలోనే పేరెన్నికగల సమరసత సేవా ఫౌండేషన్‌ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటన్నింటి క్రమంలో ఇంకా ముందుముందు తిరుపతి రాజకీయాలు ఎలా మారబోతున్నాయో అర్థం కాకుండా ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular