Gautam Gambhir controversy : టీమిండియాకు టి20, వన్డే, ఛాంపియన్స్ ట్రోఫీలు అందించిన ఘనత మహేంద్రసింగ్ ధోనీకి ఉంటుంది. ఆ తర్వాత అతని స్థాయిలో టీమిండియాను విశ్వవేదిక మీద విజేతగా నిలిపినవాడు రోహిత్ శర్మ. రోహిత్ నాయకత్వంలో టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది. 2007 తర్వాత.. దాదాపు 17 సంవత్సరాల గ్యాప్ అనంతరం ట్రోఫీని సంపాదించింది. టీమిండియా ఈ స్థాయిలో నిలవడం వెనక రోహిత్ శర్మ పాత్ర అత్యంత బలమైనది.
టి20 వరల్డ్ కప్ మాత్రమే కాదు, ఛాంపియన్స్ ట్రోఫీని కూడా టీమిండియా కు అందించాడు రోహిత్. ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మాట్లో అంత గొప్పగా ఆడకపోయినప్పటికీ.. వైట్ బాల్ ఫార్మాట్లో మాత్రం రోహిత్ శర్మకు తిరుగులేదు. నిలబడి ఇన్నింగ్స్ నిర్మించడంలో.. బలమైన షాట్లు కొట్టి ఆకట్టుకోవడంలో అతడి తర్వాతే ఎవరైనా.. రోహిత్ శర్మ ఈ స్థాయిలో సత్తా చూపించినప్పటికీ.. మేనేజ్మెంట్ నిర్ణయం వల్ల అతడు టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2024లో టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. అతడు పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. వైట్ బాల్ ఫార్మాట్లో వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి కూడా అతడు దూరం జరిగాడు. టెస్టులు, టి20 ల నుంచి శాశ్వత విశ్రాంతి తీసుకున్న రోహిత్.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో ఆడాలని అతడు బలంగా కోరుకుంటున్నాడు. అయితే గౌతమ్ గంభీర్ వల్ల అది సాధ్యమవుతుందా.. లేదా.. అనేది చూడాల్సి ఉంది.
రోహిత్ కంప్లీట్ ఫ్యామిలీ మెన్. మ్యాచ్లు లేకుంటే అతడు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహరిస్తూ ఉంటాడు.. లేదా ముంబైలో తన ఇంట్లో సరదాగా గడుపుతూ ఉంటాడు. పార్టీలు.. ఇతర వ్యవహారాలు అంటూ అతడు బయట అడుగుపెట్టడు. అతడు బయటికి వెళ్తే కచ్చితంగా కుటుంబ సభ్యులు తనతో ఉండాల్సిందే. కెరియర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు రోహిత్ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది.
ఇటీవల ఇంస్టాగ్రామ్ లో రోహిత్ ఒక స్టోరీని పోస్ట్ చేశాడు. అందులో నెట్ ఫ్లిక్స్, ముంబై ఇండియన్స్ లోగోలు ఉన్నాయి. అందులో టైటిల్ నేమ్ ముందు పదాలను కొట్టివేసి ఉంది. చివర్లో ఛాంపియన్ అని కనిపిస్తోంది. అలాగే తన జెర్సీ నెంబర్ 45.. రోహిత్ శర్మ పేరు కనిపిస్తున్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే నెట్ ఫ్లిక్స్ రోహిత్ శర్మ బయోపిక్ లేదా డాక్యుమెంటరీ ఏదైనా తీస్తోందా.. ఇంకా ఏదైనా షోలో ఆయన పాల్గొంటున్నారా.. అనే ప్రశ్నలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల నెట్ ఫ్లిక్స్ సంస్థ ప్రతినిధులు రోహిత్ శర్మను సంప్రదించారని.. అతడి కి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారని.. అందువల్లే రోహిత్ ఇటువంటి స్టోరీని పోస్ట్ చేసి ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు. మనదేశంలో క్రికెటర్లు.. ఇతర క్రీడాకారుల జీవిత చరిత్ర ఆధారంగా ఎన్నో సినిమాలు రూపొందాయి. ఇందులో ధోని బయోపిక్ అత్యంత ఆదరణ పొందింది.