మరో బాంబు పేల్చిన రఘురామకృష్ణం రాజు
సొంతపార్టీ, అధినేత సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరో ఆరోపణల బాంబు పేల్చేశారు. బ్యాంకులను మోసం చేశారంటూ.. తనకు వ్యతిరేకంగా సీబీఐ కేసు నమోదు చేయడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీగా కొనసాగడానికి ముందు నుంచే రఘురామ వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అందులో విద్యుత్ ప్రాజెక్టులు ప్రధానమైనవి. పవర్ ప్రాజెక్టులకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేశారని గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. తాజాగా గురువారం రెండో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అందులో ఎంపీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
వ్యాపారంకోసం రుణం తీసుకుని రూ.237.84కోట్లు దారి మళ్లించి, అక్రమంగా లబ్ధి పొందారనే ఫిర్యాదుపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఇండ్ భారత్ పవర్ జెన్కమ్ లిమిటెడ్ సంస్థతో పాటు దాని డైరెక్టర్లపై సీబీఐ ఢిల్లీ విభాగం గురువారం ఓ కేసు నమోదు చేసింది. చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఏఎంబీ బ్రాంచ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్.రవిచంద్రన్ ఈ నెల 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు సీబీఐ ఓ నోట్ విడుదల చేసింది. ఎంపీ రఘురామతోపాటు ఆయన కంపెనీల్లో వివిధ స్థాయిల్లో ఉన్న మొత్తం ఎనిమిది మందిపై సీబీఐ కేసు పెట్టింది. ఇప్పటికే పలు వివాదాల్లో కూరుకుపోయిన ఎంపీ రఘురామపై సీబీఐ కేసు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.
పవర్ ప్రాజెక్టుల వ్యాపారంకోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, అక్రమాలకు పాల్పడ్డారంటూ.. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఆర్ఐపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. ఢిల్లీలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అభూతకల్పనలు, అవాస్తవాలతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని అన్నారు. ఎన్పీఎల్టీలో ఉన్న తన కంపెనీపై ఎఫ్ఐఆర్ దాఖలుకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. నిధుల మళ్లింపు, దుర్వినియోగం ఆరోపణల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టారు. నిజాలన్నీ నిలకడ మీద తెలుస్తాయని, సీబీఐ విచారణకు సహకరిస్తానన్నారు.
విచారణకు సహకరిస్తానంటూనే తనపై సీబీఐ చేసిన అభియోగాల్లో నిజంలేదన్న ఎంపీ రఘురామ.. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు. ఏపీలో జగన్ సర్కారు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ తనపై కక్ష కట్టిందని, సీబీఐ ఎఫ్ఐఆర్ వెనుక వైసీపీ బడా నేతల ఒత్తిడి ఉందంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిర్యాదు చేసిన ఎస్బీఐ మేనేజరు( రవిచంద్రన్)కు, జగన్ కార్యాలయం(ఏపీ సీఎంవో) మధ్య ఫోన్ కాల్ పై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి కేసుల్లో పలు చార్జిషీటులు దాఖలైన జగన్ విచారణకు హాజరుకాకపోయినా… సీబీఐ పట్టించుకోవడం లేదని ఎంపీ రఘురామ విమర్శించారు.