
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ నేతలు మూకుమ్మడి దాడి చేశారు. ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పార్టీలు మారడం రఘురామకృష్ణంరాజు నైజమని విమర్శించారు. ఆనాడు టీడీపీ నామినేషన్, బీజేపీ నామినేషన్, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజును ప్రశించారు. ఈ రోజు ఎంపీగా గెలిచి సొంత పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
ప్రజల్లో ఆయనకు అంతపేరు ప్రఖ్యాతలు ఉంటే.. ఆయనే సొంతపార్టీ పెట్టుకుని పోటీ చేయాలన్నారు. పార్టీని కాకుండా తనను చూసే ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని చెప్పుకుంటున్న రఘురామకృష్ణంరాజుకు, నరసాపురం పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ అభ్యర్థులు కంటే ఎందుకు తక్కువగా ఓట్లు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని అరెస్ట్ చేసిన రోజు గోడ ఎందుకు దూకారో మోదీకి చెప్పాలన్నారు. తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కష్టంతోనే గెలిచామని మంత్రి పేర్కొన్నారు. తమది టీడీపీ, బీజేపీ లాంటి పార్టీ కాదని, రఘురామకృష్ణంరాజు పప్పులు ఇక్కడ ఉడకవని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.
రఘురామకృష్ణంరాజు గతం మర్చిపోయారు
ఎంపీ రఘురామకృషంరాజు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. గతంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే, జిల్లా నేతలంతా సీఎం జగన్ ను కలిసి విన్నవిస్తే.. రఘురామకృష్ణంరాజును మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. సీఎం జగన్ ఫోటో పెట్టుకుని ఆయన ఎంపీగా గెలిచారన్నారు. టిక్కెట్ కోసం మూడు పార్టీలు మారిన వ్యక్తి .. ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.