Kiran Kumar Reddy: ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చాలా ఏళ్ల తరువాత యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు. వస్తూ వస్తూ ఆయన బీజేపీలో చేరారు. ఆ పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసేందుకే చేరారన్న టాక్ వినిపిస్తోంది. అటు బీజేపీ సైతం ఆయన సేవలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగినా.. అటువంటి ప్రకటనమీ రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరిన ఫస్ట్ టైమ్ ఆయన నేడు విజయవాడ వస్తున్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగా ఏపీ బీజేపీ నేతలు సన్నాహాలు పూర్తి చేశారు.
అనూహ్యంగా సీఎం పదవి..
వైఎస్ మరణం తరువాత.. అనూహ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవి దక్కించుకున్నారు. రోశయ్య చేతి నుంచి పాలనాపగ్గాలు అందుకున్నారు. మూడేళ్లలో పాలనాపరంగా మంచి మార్కులే సాధించుకున్నా.. కాంగ్రెస్ పార్టీపై మాత్రం పట్టు నిలుపుకోలేకపోయారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో ఆయన ప్రతిపాదనలకు హైకమాండ్ పెద్దగా విలువ ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర విభజన తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టినా ఆయన సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు ఆయన తెరపైకి రాలేదు. ఈ మధ్య కాలంలో ఆయన మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినా ప్రయోజనం లేకపోయింది. ఆయన కు పార్టీ తరపున పని చేసే చాన్స్ ఇవ్వలేదో.. ఆయనే వద్దన్నారో కానీ.. రాజీనామా చేసే వరకూ ఆయన పెద్దగా రాజకీయ కార్యకలాపాల్లో కనిపించలేదు.
ఏ హంగామా లేకుండా…
సాధారణంగా ఓ రాష్ట్ర మాజీ సీఎం పార్టీలో చేరితే ఎంతో హడావుడి ఉంటుంది. కానీ కిరణ్ చేరిక సమయంలో ఏ హంగామా లేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు సైతం పెద్దగా కనిపించలేదు. అలాగని ప్రధాని మోదీ, అమిత్ షా వంటి వారితో కాకుండా సామాన్య నాయకుల సమక్షంలో కిరణ్ జాయిన్ అయ్యారు. నాడు పార్టీలో చేరిన సమయంలో ముఖం చాటేసిన నాయకులు.. ఇప్పుడు స్వాగతం చెబుతారంటే అదీ డౌటే. ఇప్పటికే బీజేపీలో మూడు గ్రూపులు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. ఇప్పడు కిరణ్ ఆగమనంతో మరో వర్గం తయారు కావడం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఆయన వెంట నడిచేవారెవరు?
కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేని కిరణ్ ఇప్పడు బీజేపీకి ఏం చేస్తారన్నది ప్రశ్న. పార్టీ హైకమాండ్ ఏదో యాక్టివ్ పోస్టు ఇవ్వనుందని ప్రచారం సాగుతోంది. అయితే అది ఎంతవరకూ వాస్తవమో అన్నది తెలియడం లేదు. సమైక్యాంధ్ర, తరువాత కాంగ్రెస్ లో చేరినా కిరణ్ రాజకీయంగా పావులు కదపలేకపోయారు. ఆయనతో పనిచేసిన టీమ్ చాలావరకూ వైసీపీలో ఉంది. మరికొందరు టీడీపీలో మంచి స్థానాల్లోనే ఉన్నారు. ఇప్పుడు కిరణ్ పిలిస్తే వారంతా వెళతారా అన్నది డౌటే. ఎందుకంటే జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నా రాష్ట్రంలో బీజేపీ బలం పెంచుకోకపోవడమే అందుకు కారణం. బీజేపీ నుంచి నేతలు బయటకు వస్తున్న వేళ.. అదే పార్టీలోకి వెళ్లడం అంటే సాహసంతో కూడుకున్న పనే. బీజేపీ హైకమాండ్ ఆశా ‘కిరణం’గా చూస్తున్న అంత వర్కువుట్ అయ్యే చాన్స్ లేదని విశ్లేషకుులు అభిప్రాయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More