CM Jagan: జగన్ చేస్తున్నది హెచ్చరికా? విన్నపమా? అన్నది తెలియడం లేదు. ఏపీ ప్రజలను హెచ్చరిస్తూనే.. ఆయన విన్నపాలు చేస్తున్నారు. 124 సార్లు బటన్ నొక్కాను.. నాకోసం రెండుసార్లు బటన్ నొక్కలేరా? అని ప్రజలను ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక రకమైన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధానికి సిద్ధపడుతూనే బ్రహ్మాస్త్రాలను వదులుతున్నారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సిద్ధం పేరిట విశాఖ జిల్లా భీమిలిలో తొలి సభ ఏర్పాటు చేశారు. నిన్న ఏలూరు జిల్లా దెందులూరు లో రెండో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో జగన్ అపరిచితుడులా మారారు. ఒకసారి ఏడ్చినంత పని చేశారు. మరోసారి హెచ్చరించేలా మాట్లాడారు. చివరకు విన్నపం చేశారు. మరోసారి హాస్యాన్ని జోడించారు. మొత్తానికైతే ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు.
రామాయణ మహాభారతంలో ఉన్న విలన్లంతా ఏపీలో ఉన్నారని జగన్ చెప్పుకోవడం విశేషం. ఇతర పార్టీల్లో చంద్రబాబు మనుషులు ఉన్నారని.. వారంతా ఏకమవుతున్నారని.. ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి.. అర్జునుడు అయిన నన్ను కౌరవుల నుంచి రక్షించాలని జగన్ పిలుపునివ్వడం విశేషం.చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, షర్మిల.. వీరందరిపై జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎల్లో మీడియా ఏకమై తనపై కుట్ర చేస్తోందని పాత మాటలనే చెప్పుకొచ్చారు. 99 శాతం హామీలను అమలు చేసి ప్రజా మద్దతు ఉన్న తనను ఎవరూ ఏమీ చేయలేరని జగన్ తేల్చి చెప్పారు.
అయితే జగన్ గతానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ప్రజలకు అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం విపక్ష నాయకులంతా చంద్రబాబు మనుషులేనని తేల్చి చెబుతున్నారు. చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. మరోవైపు పురందేశ్వరి అనుకూలంగా ఉన్నారు. తాజాగా షర్మిల పిసిసి పగ్గాలు అందుకున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ కూడా జగనే. చివరకు వామపక్షాలు సైతం జగన్ అధికారం నుంచి దూరం కావాలని గట్టిగా కోరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలను ఒక రకమైన బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు మీకోసం, మీ సంక్షేమం కోసం పనిచేశానని.. ఇప్పుడు మీ అవసరం వచ్చిందని.. అందుకే రెండుసార్లు బటన్ నొక్కండి అంటూ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు విపక్షాల తీరును ఎండగడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా ప్రజలను హెచ్చరిస్తూనే, విజ్ఞప్తి చేస్తూనే… జగన్ చేస్తున్న విన్నపాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.