కొత్త పార్టీ ఏర్పాటే లక్ష్యంగా వైఎస్ షర్మిల తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటోంది. దీంతో ఒక్కో పార్టీలో అప్పుడే చర్చ ప్రారంభమైంది. అసలు షర్మిల పార్టీ పెడితే మిగితా పార్టీల పరిస్థితి ఏంది..? ఎవరెవరు ఆమె వెంట వెళ్తారు..? తమ పార్టీల నుంచి ఎవరెవరు బయటకు వెళ్లిపోతారు..? అని లెక్కలేసుకుంటున్నాయి. ఒకవేళ ఆమె పార్టీ పెడితే రాష్ట్రంలో ఫ్యూచర్ ఏంటి..? అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తనయుడు షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వైఎస్ అభిమానులతో షర్మిల జరిపిన ఆత్మీయ సమ్మేళనానికి ఆ యువనేత హాజరైన సమయంలోనే లోటస్పాండ్లో మంత్రి పేరు కూడా ప్రస్తావనకు రావడం గమనార్హం.
Also Read: తెలంగాణ ప్రజలకు షర్మిల ‘ఓదార్పు’
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్ని పార్టీలూ కీలకంగా భావించే చేవెళ్ల స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాలె యాదయ్య. ఎమ్మెల్యే రెండో కొడుకు కాలె రవికాంత్ వరుసగా రెండు సార్లు షర్మిలతో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ వేదికగా శుక్రవారం షర్మిలను కలిసిన రవికాంత్.. శనివారం నాటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆత్మీయ సమావేశానికి కూడా హాజరైనట్లు తెలిసింది. షర్మిలకు రవికాంత్ అభివాదం చేస్తున్న ఫొటో ప్రస్తుతం వైరల్ అయింది. షర్మిలతో భేటీపై కాలె తనయుడు వివరణ ఇచ్చినప్పటికీ, ప్రస్తుత తరుణంలో అసలాయన లోటస్ పాండ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? తండ్రి అనుమతితోనే ఈ తతంగం జరిగిందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
Also Read: కేసీఆర్ సిక్ లీవ్లు అందుకేనా..? : కేంద్ర సమావేశాలపై ఇంట్రస్ట్ లేదా..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముందుగా స్థానిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి చేపట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంపీపీ, జడ్పీటీసీగానూ గెలుపొందిన కాలె యాదయ్య తాను వైఎస్ వీరాభిమానిని అని గతంలో చాలా సార్లు చెప్పుకున్నారు. వైఎస్సార్ పట్టుపట్టి మరీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్యకు టికెట్ ఇప్పించారు. తొలిసారి ఓడిపోయినా.. తర్వాతి కాలంలో ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో చేరిన యాదయ్య జిల్లాలో కీలక నేతగా కొనసాగుతున్నారు. గతంలో వైఎస్కు దగ్గరి నేతలుగా పేరొందిన వాళ్లందరికీ షర్మిల కొత్త పార్టీ నుంచి ఆహ్వానాలు వెళ్తున్న క్రమంలోనే కాలె కుటుంబానికీ పిలుపు వచ్చిందని, ఎమ్మెల్యే నేరుగా వెళ్లి షర్మిలతో భేటీ కాకుండా కుమారుడ్ని పంపించి ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాలె కుటుంబం నాలుగు కీలక పదవుల్లో కొనసాగుతోంది. కాలె యాదయ్య చేవెళ్ల ఎమ్మెల్యే కాగా, యాదయ్య సతీమణి జయమ్మ నవాబ్పేట మండల జడ్పీటీసీగా, పెద్ద కుమారుడు శ్రీకాంత్ మొయినాబాద్ జడ్పీటీసీగా ఉన్నారు. ఇక రెండో కొడుకు రవికాంత్ భార్య దుర్గాభవాని.. చించల్పేట్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ అనుమతితో తన కుటుంబీకులను బరిలోకి దింపిన యాదయ్య.. అందరినీ గెలిపించుకుని సత్తా చాటారు. అలాంటిదిప్పుడు రవికాంత్.. షర్మిలపెట్టే కొత్త పార్టీలో చేరే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని రవికాంత్ చెబుతున్నారు. మరి అలాంటప్పుడు లోటస్ పాండ్కు వెళ్లాల్సిన అవసరం ఏంటని కాలె వ్యతిరేక వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.