Toll Charges
Toll Charges: జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ చార్జీలు పెంచాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది. ఏటా ఏప్రిల్ 1న రుసుము పెంచుతోంది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం సూచించింది. జూన్ 1న పోలింగ్ ముగియనుండడంతో అదే రోజు అర్ధరాత్రి(జూన్ 2) నుంచి చార్జీలు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈమేరకు టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది.
5 శాతం పెంపు..
ఇక టోల్ చార్జీల పెంపు ప్రస్తుతం వసూలు చేస్తున్న మొత్తంపై 5 శాతం పెరగనున్నాయి. ఒక వాహనానికి రూ.100 వసూలు చేస్తుంటే దానిపై 5 శాతం అంటే రూ.5 పెరిగి జూన్ 2 నుంచి రూ.105 వసూలు చేస్తారు. అప్అండ్డౌన్ చార్జీలు రూ.210 వసూలు చేస్తారు. గతంలో కారు, ప్యాసింజర్ వ్యాన్లతోపాటు లైట్ కమర్షియల్ వాహనాల టోల్ రుసుము పెంచలేదు. రెండేళ్లుగా వాటిని కూడా పెంచుతున్నారు.
తెలంగాణలో 28 టోల్ప్లాజాలు..
తెలంగాణ రాష్ట్రం మీదుగా వెళ్తున్న వివిధ జాతీయ రహదారులపై మొత్తం 28 టోల్ ప్లాజాలు ఉన్నాయి. గతంలో 60 కిలో మీటర్లకు ఒక టోల్ ప్లాజా మాత్రమే ఉండేలా చూస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో కొన్ని మూతపడతాయని భావించారు. కానీ, అది అమలు చేయకపోవడంతో 28 టోల్ ప్లాజాలు కొనసాగుతున్నాయి. పెరగనున్న చార్జీలతో వాహనదారులపై భారం పడనుంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More