Homeఆంధ్రప్రదేశ్‌TS Eamcet 2023: స్వరాష్ట్రంలోనూ ఆంధ్రుల హవా.. తెలంగాణలో మరో ఉద్యమం తప్పదా!

TS Eamcet 2023: స్వరాష్ట్రంలోనూ ఆంధ్రుల హవా.. తెలంగాణలో మరో ఉద్యమం తప్పదా!

TS Eamcet 2023: నీళ్ల, నిధులు, నియామకాలు, స్వపరిపాలన.. ఈ నినాదాలే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలకం. సబ్బండ వర్ణాలు ఒక్కటై స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమించేలా చేసిన ఈ నినాదాలతో తెలంగాణ వాదుల్లో స్ఫూర్తి నింపాయి. స్వరాష్ట్రం సాధించేలా చేశాయి. తర్వాత ఆంధ్రులను తరిమేయాలన్న పరిస్థితి కూడా వచ్చింది. తర్వాత ఆంధ్రాలోనూ ప్రత్యేక ఆంధ్రా ఉద్యమం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్ర విభజన అనివార్యమైంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంత వరకు బాగానే ఉంది. అయితే ఆంధ్రుల హవా ఇప్పటికీ తెలంగాణలో కొనసాగుతోంది. ఇందుకు ఇటీవల విడుదలైన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలే నిదర్శనం. ఇందులో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఏడు ఆంధ్రా విద్యార్థులే సాధించడం గమనార్హం. ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌ విభాగాల్లో రెండింటిలోనూ ఆంధ్రులే సత్తా చాటారు. తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి అగ్రి విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు సాధించాడు. పది మందిలో ఏడు ర్యాంకులు ఆంధ్రా విద్యార్థులకే వచ్చాయి. ఇంజినీరింగ్‌ విభాగంలోనూ పది ర్యాంకుల్లో 8 మంది ఆంధ్రా విద్యార్థులే.

స్వరాష్ట్రంతో లాభం ఏమిటన్న ప్రశ్న..
ఒకవైపు తెలంగాణలో అన్నివర్గాలు అసంతృప్తిగానే ఉన్నాయి. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, ప్రజలు, వ్యాపారులు ఇలా అన్నివర్గాల్లో ప్రస్తుత తెలంగాణ పాలకులపై ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని బాధపడుతున్నారు. ఒకవైపు కుటుంబ పాలన, ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల్లో కూరుకుపోవడం వంటి కారణాలు పాలకులపై వ్యతిరేకత పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో విద్యార్థులు కూడా చేరుతున్నారు. తెలంగాణలో నిర్వంచే పరీక్షల్లో ఆంధ్రా విద్యార్థులకు అనుమతించడంతో పోటీ పరీక్షల్లో అక్కడి విద్యార్థులే ఇక్కడి టాప్‌ ర్యాంకులు తన్నుకుపోతున్నారు. దీంతో విద్యార్థులే మరో ఉద్యమానికి తెరలేపే అవకాశం కనిపిస్తోంది.

స్థానికేతరులకు అవకాశంపై ఆగ్రహం..
ఉన్నత చదువుల కోసం తెలంగాణలో నిర్వహించే పరీక్షల్లో ఆంధ్రా విద్యార్థులకు అవకాశం ఇవ్వడంపై తెలంగాణ విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉంది. ఆంధ్రాతోపాటు, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు కూడా ఎంట్రన్స్‌ పరీక్షలు రాస్తున్నారు. అయితే ఆంధ్రా విద్యార్థుల్లా ఎవరూ పరీక్షలు రాయడం లేదు. ర్యాంకులు సాధించడం లేదు. ఆంధ్రా విద్యార్థుల సత్తా చాటుతున్నారు. తెలంగాణ విద్యార్థులను వెనక్కునెట్టి ర్యాంకుల్లో టాపర్లుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికేతరులను ప్రవేశపరీక్షలకు అనుమతించొద్దనే డిమాండ్‌ విద్యార్థుల నుంచి వస్తోంది.

ఓపెన్‌ కేటగిరీలో ఎవరికైనా చాన్స్‌..
యూజీసీ నిబంధనల ప్రకారం ఓపెన్‌ కేటగిరీలో దేశంలోని ఏ రాష్ట్రంలోని విద్యార్థులైనా దేశంలోని ఏ యూనివర్సిటీ పరీక్షలు అయినా రాసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధన ఆంధ్రా విద్యార్థులకు కలిసి వస్తోంది. రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయినా.. ఆంధ్రా విద్యార్థులు తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్షలు రాస్తున్నారు. టాప్‌ సీట్లు తన్నుకుపోతున్నారు. ఓపెన్‌గా పోటీపడుతున్నా.. స్థానికేతరులు, ఆంధ్రులు అనే భావన స్థానిక విద్యార్థుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular