Sir Creek: మన దేశ రక్షణ చర్చల్లో జమ్మూ కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సరిహద్దులు తరచుగా కేంద్రంగా ఉంటాయి. పొరుగు దేశాలతో సంబంధాలు, ఉద్రిక్తతలు గురించి విస్తృతంగా ఆలోచిస్తాం. అయితే గుజరాత్ సరిహద్దులోని సర్క్రీక్ ప్రాంతంపై అంతగా దృష్టి సారించం. ఇది కేవలం భౌగోళిక ప్రాంతం కాదు. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, రక్షణపరంగా కీలకమైన జోన్. ఇక్కడ పాకిస్తాన్ కన్ను పెట్టడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది.
సర్క్రీక్ అంటే ఏమిటి?
సర్క్రీక్ 96 కిలోమీటర్ల పొడవైన ఉప్పుడేటు. సింధు నది పాయలు అరేబియా సముద్రాన్ని కలిసే చోట ఇది ఉంది. సముద్రపు ఉప్పునీరు, నది మంచినీరు కలిసి ప్రవహిస్తాయి. ఇలాంటి 17 ఉప్పుటేరు నదులు ఇక్కడ ఉన్నాయి. ఇది అత్యంత దుర్గమమైన ప్రాంతం. దట్టమైన అడవులు, సముద్రపు ఆటుపోట్లు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి. ప్రాచీన కాలం నుంచి దీన్ని ‘వనగంగ’గా పిలిచేవారు. రాణ్ ఆఫ్ కచ్గా కూడా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతం పాకిస్తాన్ చేతిలోకి వెళితే అరేబియా సముద్రంలోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్పై పాక్ హక్కులు పెరుగుతాయి. దీనివల్ల సముద్ర వనరులు, మత్స్య సంపద, వ్యూహాత్మక నియంత్రణ పాకిస్తాన్కు లభిస్తుంది.
చారిత్రక నేపథ్యం
1965 యుద్ధానికి ముందు రాణ్ ఆఫ్ కచ్లో జరిగిన సంఘర్షణలో పాకిస్తాన్ పైచేయి సాధించింది. దీనితో భారత్పై గెలిచే సత్తా తమకు ఉందని పాక్ భావించింది. ఆ తర్వాత 30 వేల మందిని కశ్మీర్లోకి పంపించి పరిస్థితిని యుద్ధ స్థాయికి తీసుకెళ్లింది. ఈ చారిత్రక అనుభవం నేటికీ పాకిస్తాన్ వ్యూహాల్లో ప్రభావం చూపుతోంది. గతేడాది అక్టోబర్–నవంబర్ నుంచి సర్క్రీక్పై పాక్ దృష్టి మళ్లీ పెరిగింది.
‘అబాబీల్’ ప్రాజెక్టు..
పాకిస్తాన్ ఇక్కడ ఔట్పోస్టుల సంఖ్య పెంచింది. ఆయుధాలు, విమానాలు, రాకెట్ ఫోర్స్ను మోహరించింది. ప్రత్యేక గ్రూపులను కఠినమైన ఆపరేషన్లకు సిద్ధం చేస్తోంది. ‘అబాబీల్’ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. అబాబీల్ అంటే పక్షి. మక్కాపై శత్రువులు దాడి చేసినప్పుడు పక్షుల సమూహం రక్షణగా వచ్చిందని నమ్మకం. భారత్పై ఇలాంటి దాడి చేస్తామని సూచించేందుకు ఈ పేరు పెట్టినట్లు అర్థమవుతోంది. చైనా, టర్కీ నుంచి ఆయుధాలు సమకూరుస్తున్న నేపథ్యంలో పాక్ కార్యకలాపాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. పాకిస్తాన్ నేవీ చీఫ్ సర్క్రీక్ తమదేనని ప్రకటిస్తున్నారు. భారత్ మాత్రం దీన్ని అంగీకరించడం లేదు.
భారత్ స్పందన
గతేడాది అక్టోబర్లో రక్షణ మంత్రి సర్క్రీక్లో పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడితే పాక్ భౌగోళిక, చారిత్రక పరిస్థితులు మారిపోతాయని హెచ్చరించారు. ఇటీవల పాక్ దుశ్చర్యకు సంకేతాలు రావడంతో భారత్ ఆర్మీ యూనిట్లను ఈ ప్రాంతానికి తరలించింది. 11 హైస్పీడ్ పడవలను సిద్ధంగా ఉంచింది. ఇవి నీటిపై, బురదలో, నేలపై కూడా ప్రయాణించగలవు. 1952 కిలోల పేలుడు పదార్థాలు, 12 మంది సిబ్బందిని ఒకేసారి తీసుకెళ్లగల సామర్థ్యం ఉంది. భారత్ ఈ ప్రాంతంలో గస్తీ పెంచి ఆయుధాలు మోహరిస్తోంది. వనసంపద, మత్స్య వనరులు, సముద్ర సంపదను కాపాడేందుకు ఇది అవసరం.
సర్క్రీక్ కేవలం సరిహద్దు రేఖ కాదు. ఇది సముద్ర ఆర్థిక జోన్, వ్యూహాత్మక నియంత్రణ, జాతీయ భద్రతకు అనుసంధానమైన అంశం. 1965 అనుభవం పాకిస్తాన్కు పాఠం కావాల్సి ఉండగా, మళ్లీ ఇక్కడ కార్యకలాపాలు పెంచడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం సరైన వ్యూహం. అయితే ఈ ప్రాంతం దుర్గమమైనది కావడంతో నిఘా, సాంకేతిక సామర్థ్యం, ద్విపక్ష చర్చలు కూడా ముఖ్యం.