ఇన్నాళ్లు బయట పోరాటాలే చూశారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ తరుఫున కేంద్రంతో కొట్లాడడానికి రెడీ అయ్యారు. ఏకంగా బీజేపీలో చేరుతారని అందరూ అనుకుంటున్న వేళ.. అదే బీజేపీపై జేడీ లక్ష్మీనారాయణ పోరుబాటకు శ్రీకారం చుట్టడం సంచలనమైంది.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ విశ్రాంత ఐపీఎస్ అఝధికారి లక్ష్మీనారాయణ మంగళవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని పిటీషన్ లో కోరారు.
ప్రత్యామ్మాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చని.. ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదని పిటీషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయవద్దని ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కార్మికుల ఉద్యమానికి మద్దతుగా నిలిచిన లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కుపై న్యాయపోరాటానికి దిగడం సంచలనమైంది. ఇక విశాఖ ఉక్కును నష్టాల నుంచి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఇక ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మిక సంఘాలు, వివిధ పార్టీల నేతలతో లక్ష్మీనారాయణ సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో విశాఖ ఉద్యమంలోకి జేడీ లక్ష్మీనారాయణ దిగారని అర్థమవుతోంది.