ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్ జర్నలిస్టు, సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పుత్తూరులో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన ఆయన ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్తలలో పని చేశారు.
ఈనాడు ప్రారంభ సమయంలో ప్రధాన సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగులో తాత్విక పాదాల నిఘంటువు `ఆధ్యాత్మిక పదకోశం’ రచించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు.
అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్ ఆఫ్ పవర్’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఆయన విధులు నిర్వర్తించారు.
2004లో ఏపీ ప్రభుత్వం, నక్సలైట్ల మధ్య జరిగిన చర్యలలో ఆయన కూడా కీలక భూమిక వహించారు. తన స్వగ్రామాన్ని దత్తత తీసుకొని, అభివృద్ధి కోసం కృషి చేశారు.
సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
సీనియర్ జర్నలిస్టు పొత్తూరి వేంకటేశ్వర రావు మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజిక సేవా రంగాల్లో ఆయన చేసిన కృషిని, అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి వేంకటేశ్వర రావు అందించిన నైతిక మద్దతును కెసిఆర్ గుర్తుచేసుకున్నారు