Homeఆంధ్రప్రదేశ్‌పైసలకోసం రోడ్డున పడ్డ జగ్గారెడ్డి

పైసలకోసం రోడ్డున పడ్డ జగ్గారెడ్డి

Jaggareddy
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాల ఎమ్మెల్యేలకు నిధులు కరువయ్యాని నిత్యం ఆందోళన కార్యక్రమాలకు దిగుతున్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లేదని వాపోతున్నారు. కనీసం నిధులు కూడా కేటాయించడం లేదని అంటున్నారు. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చుకోలేని దుస్థితిలో కొనసాగుతున్నామని.. ఇలా అయితే.. ఓట్లేసి గెలిపించిన వారికి తమ ముఖాలు ఎలా చూపిస్తామని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడితోనో.. ప్రజల తరఫున పోరాడాలని అనుకుంటున్నారో తెలియదు కానీ.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నిరసన బాట పడుతున్నారు. తమ నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని వేడుకుంటున్నారు. లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన బాట పట్టారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరుతూ.. నిరసనకు దిగారు. సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని, నియోజకవర్గ అభివృద్ధికి రూ. వెయ్యికోట్లు కేటాయించాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంకుబండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తన కుమార్తె జయారెడ్డితో కలిసి గురువారం నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న మీడియా పాయింట్ దగ్గర జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేశానని తెలిపారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే సిద్ధిపేటకు తరలించారని అన్నారు. 2013లో ఐదువేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వారికి అక్కడి నుంచి ఖాళీ చేయించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 40వేల మంది పేదలు ఇళ్లులేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

వారందరికీ ఇల్ల స్థలాలు ఇవ్వమంటే.. స్పందన లేదని అన్నారు. కనీసం నియోజకవర్గ అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఇవ్వాలని అడిగినా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు తమ పార్టీకి కొంత సమయమే ఇచ్చి మైక్ కట్ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే పార్టీ నేతలతో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular