Homeఆంధ్రప్రదేశ్‌జగన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న ఒకే ఒక్కడు

జగన్ ను ముప్పుతిప్పలు పెడుతున్న ఒకే ఒక్కడు

ఏపీలో ప్రతిపక్షం అనేది ఉందా అని అందరికీ డౌట్ వస్తోందట.. ఎందుకంటే కరోనా కారణంగా ఆ మహమ్మారికి భయపడి ఏడాది కాలంగా చంద్రబాబు పక్కరాష్ట్రంలోని హైదరాబాద్ లో ఉండిపోయారు. ఏపీకి అప్పుడప్పుడూ టూరిస్ట్ లాగా వచ్చేసి మమ అనిపించి వెళుతున్నారు. సమస్యలపై నిలదీతలు.. పట్టించుకోవడాలు తక్కువే. ఇక జనసేన పవన్ కళ్యాణ్ అమవాస్య చంద్రుడిలా నెలకోసారి మెరుస్తున్నాడు. ఈ మధ్య అదీ తగ్గించాడని ఏపీ ప్రజల్లో చర్చ సాగుతోంది.

అయితే ప్రతిపక్షం టీడీపీ గమ్మున ఉంటుండగా.. ఏపీ సర్కార్ కు, జగన్ కు ఒకే ఒక్కడిగా ముప్పతిప్పలు పెడుతూ తనే ఒక సైన్యంలా ప్రతిపక్షంగా మారాడు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాల్ చేస్తున్నాడు. జగన్ పథకాల్లోని లూప్ హోల్స్ ను లేవనెత్తుతున్నాడు. జగన్ తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని.. అందులోని తప్పులను వేలెత్తి చూపిస్తున్నాడు. ప్రతిపక్షం టీడీపీ కూడా పట్టలేని ఈ తప్పులను వెతికి మరీ పట్టుకుంటూ కోర్టుల్లో వాటిని అడ్డుకుంటున్నాడు. విజయాలు సాధిస్తున్నాడు.

ఇప్పటికే జగన్ బెయిల్ రద్దుపై రఘురామ కోర్టుకెక్కి సీఎంను జైలుకు పంపించేలా కోర్టుల్లో వాదిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. ఇక తనను అరెస్ట్ చేయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించాడని జగన్ ఇమేజ్ ను జాతీయస్థాయిలో డ్యామేజ్ చేసేస్తున్నాడు వైసీపీ ఎంపీ రఘురామ. కేంద్రమంత్రులకు, గవర్నర్లకు, కోర్టులకు లేఖలు రాస్తూ జగన్ కు ఉన్న పరపతిని గంగపాలు చేస్తున్నారు.

ప్రతీ నిర్ణయాన్ని వెతికి మరీ జగన్ సర్కార్ ముందరి కాళ్లకు ఎంపీ రఘురామకృష్ణంరాజు ‘అతడే ఒక సైన్యం’లా మారి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాడు. ప్రతిపక్షం టీడీపీ మిన్నకుంటున్న వేళ రఘురామ పోషిస్తున్న ఈ పాత్ర నిజంగానే ఏపీ ప్రజల వాయిస్ ను వినిపిస్తున్న చందంగా ఉందని ప్రశంసలు కురుస్తున్నాయి.

ఏపీ ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ ఆస్తులను అమూల్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని కూడా ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఇటీవల హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. డెయిరీ ఆస్తులను లీజుకు ఇవ్వాలనుకుంటే నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్ డీడీబీ)కి ఇవ్వకుండా గుజరాత్ కు చెందిన అమూల్ కు ఇవ్వడం ఏమిటని రఘురామ లేవనెత్తిన లాజిక్ తో జగన్ సర్కార్ ఇరుకునపడింది. అమూల్ చేతికి ఏపీ డెయిరీ ఆస్తులను అప్పగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం జీవో 117 జారీ చేసింది. రాష్ర్టంలోని డెయిరీ ఆస్తులను అమూల్ సంస్థకు కేటాయించేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో పిల్ వేశారు. గురువారం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టింది.

రాష్ర్టంలో డెయిరీ డెవలప్ మెంట్ సంస్థ ఆస్తులను ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగించే ప్రభుత్వ జీవోను హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు సవాల్ చేసారు. అమూల్‌తో జరిగిన ఒప్పందంపై ఎలాంటి నిధులను ఖర్చు చేయొద్దని గతంలో హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశించింది. ఈ ఉత్తర్వులను జూలై 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలని ఎన్‌డీడీబీ కోరింది. మధ్యంతర ఉత్తర్వులపై తమ వాదనలు వినాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే కౌంటర్‌కు సమయం ఇచ్చాక వాదనలు వినలేమని ఏపీ హైకోర్టు షాకిచ్చింది. దీంతో జగన్ సర్కార్ ఇరుకునపడినట్టైంది.

ఇలా ప్రతీదాంట్లోనూ ఎంపీ రఘురామ.. సీఎం జగన్ తప్పుల్లో లాజిక్ లను పట్టుకొని మరీ వెలికితీసి వాటిని కోర్టుల్లో ఎండగడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కొట్టుడుపోయేలా చేస్తున్నారు. దీంతో అసలు ఏపీలో ప్రతిపక్షం టీడీపీనా? లేక ఎంపీ రఘురామ అన్న అనుమానాలు కలుగక మానవు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular