రాజకీయం అంటేనే వ్యూహం. ఉన్న పరిస్థితులను మదించి, ఏం చేస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందులో తేడా వస్తే.. ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందుకే.. పార్టీలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటాయి. అయితే.. ప్రతి నిర్ణయమూ ఒక ప్రయోగం అనుకోవాల్సిందే. ఆ నిర్ణయ ఫలితం వెలువడే వరకూ ఏం జరుగుతుందన్నది ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు జనసేనాని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది సక్సెస్ అవుతుందా? ఫెయిల్ అవుతుందా? అన్నదే ఇప్పుడు చర్చ.
తెలుగు రాష్ట్రాల నడుమ జల జగడం ఏ స్థాయిలో కొనసాగుతోందో తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య మాటలతో మొదలైన యుద్ధం.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి లేఖలు రాసే వరకూ వెళ్లింది. ఆ తర్వాత సుప్రీం కోర్టుకు సైతం ఈ పంచాయితీ చేరింది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రా మధ్య నీటి గొడవ తారస్థాయికి చేరింది. అయితే.. ఈ విషయంలో ఏపీ నుంచి అధికార పార్టీ తప్ప, ఎవ్వరూ స్పందించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సైతం ఈ అంశంపై ఇప్పటి వరకూ మాట్లాడలేదు.
ఇటు జనసేన సైతం ఈ విషయంలో స్పందించలేదు. దీనిపై ఇటీవల నిర్వహించిన పార్టీ అంతర్గత సమావేశంలో ఒక నిర్ణయం కూడా తీసుకున్నారట. దీని ప్రకారం.. ఈ అంశంపై ఎవ్వరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు జనసేనాని సూచించారట. ఈ విషయంలో రెండు రాష్ట్రాల పొరపాట్లూ ఉన్నాయని భావిస్తున్నారట పవన్. అందువల్ల ఎటు మాట్లాడినా.. మరో వైపు ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో మౌనాన్ని ఆశ్రయించడమే మంచిదని నిర్ణయించుకున్నారట.
టీఆర్ఎస్-వైసీపీ రాజకీయం చేస్తున్నాయని, అందులో ఇన్వాల్వ్ అవడం ద్వారా వచ్చేదానికన్నా.. పోయేది ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారట. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే.. అక్కడ పార్టీకి ఇబ్బంది కలుగుతుందని చూస్తున్నారట. ఇటు జగన్ ను తిట్టినా.. అది రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఉందని అంటున్నారట. కాబట్టి.. ఈ విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి.. ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తారన్నదాన్ని బట్టి స్పందించాలని జనసేనాని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మరి, ఈ నిర్ణయం సరైందేనా? అన్నది డౌట్. ఒక సమస్య వచ్చినప్పుడు తాము ఎటువైపు నిలబడతామనేది చెప్పాల్సి ఉంటుంది. అలా కాకుండా.. మౌనంగా ఉండడం మంచి వ్యూహం అవుతుందా? అనే చర్చ సాగుతోంది. మరి, దీనికి పవన్ పార్టీ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pawan kalyan decided to remain neutral in krishna water issue
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com