Ajit Doval: పహల్గాం ఉగ్రదాడి భారత భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సంఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న తక్షణ నిర్ణయాలు, సైనిక వ్యూహం, ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ డిస్కవరీ ఛానెల్కు వెల్లడించారు. ఈ వివరాలు భారత్ దృఢమైన వైఖరిని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా స్పష్టమైన సందేశాన్ని తెలియజేస్తున్నాయి.
మోదీ తక్షణ స్పందన..
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి సమయంలో ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని భారత్కు తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలోనే జాతీయ భద్రతా సలహాదారు, త్రివిధ దళాల అధినేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని అంచనా వేసి, బాధ్యులు ఎవరో గుర్తించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
దాడికి బాధ్యులు నింగి, నేతలపై ఉండొద్దు!
పహల్గాం దాడికి కారకులు ఎవరైనా వారు భూమిపై గానీ, ఆకాశంలో గానీ ఉండకూడదు. ఎవరినీ వదలకూడదు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ఎలాంటి పరిమితులూ ఉండవు అని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు, ముఖ్యంగా పహల్గాం సంఘటనకు సంబంధించిన స్థావరాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించాలని సూచించారు. ఆపరేషన్ సిందూర్ కేవలం ప్రతీకార చర్య కాదు. ఇది భారత్ సహనాన్ని బలహీనతగా చూడవద్దని, అలాంటి ఆలోచన కూడా ప్రత్యర్థులకు రాకూడదని స్పష్టం చేసే వ్యూహాత్మక చర్య. ప్రత్యర్థులు కోలుకోలేని దెబ్బ కొట్టగల సామర్థ్యం భారత్కు ఉందని నిరూపించాలని మోదీ సూచించారు. దేశ సార్వభౌమాధికారం కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధమని తెలిపారు.
చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం..
ఈ సందర్భంగా అజిత్ ధోవల్ మాట్లాడుతూ చివరి రక్తపు చుక్క వరకు పోరాడతామని. మాజీ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సహా ఇతర అధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఉగ్రవాదం, చర్చలు ఒకేసారి సాగవని పాకిస్తాన్కు స్పష్టమైన సందేశం ఇచ్చారు. డిస్కవరీ ఛానెల్లో ప్రసారమైన డాక్యుమెంటరీలు ఈ ఆపరేషన్లో మహిళా పైలట్లు కూడా పాకిస్తాన్ లోతుల్లోకి వెళ్లి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన విషయాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఇది భారత వైమానిక దళం, మొత్తం సైనిక యంత్రాంగం సామర్థ్యాన్ని, లింగ నిరపేక్షతను ప్రతిబింబిస్తుంది.
భద్రతా విధానంలో మార్పు..
ఈ వివరాలు భారత్ ఉగ్రవాద వ్యతిరేక విధానంలో ముఖ్యమైన మార్పును సూచిస్తున్నాయి. గతంలో కొన్ని సందర్భాల్లో సహనం, దౌత్యం మీద ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, ఇప్పుడు తక్షణ, నిర్ణయాత్మక సైనిక చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ‘భూమిపై, ఆకాశంలో ఉండకూడదు’ అనే ఆదేశం ఉగ్రవాద నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలించే లక్ష్యాన్ని సూచిస్తుంది. అదే సమయంలో, ఇది అంతర్జాతీయ సమాజానికి కూడా సందేశం. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చే దేశాలు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. భారత్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా, రాజకీయ సంకల్పాన్ని కూడా స్పష్టం చేసింది.
అజిత్ ధోవల్ వెల్లడించిన వివరాలు పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయాల బలాన్ని, సమన్వయాన్ని, లక్ష్య దష్టిని వెల్లడిస్తున్నాయి. ఇది కేవలం ఒక ఆపరేషన్ కథనం కాదు; జాతీయ భద్రతా విధానం యొక్క కొత్త దశను సూచించే ముఖ్యమైన అధ్యాయం.