తెలంగాణలో కొందరు కోట్లు కుమ్మరిస్తున్నారు. “రెడ్ మెర్క్యూరీ” కోసం టీవీ మెకానిక్ షాపుల్లో పాత టీవీలు, పాత రేడియోల కోసం వెతికి ఒక్కో పాత టీవీ, పాత రేడియోకు లక్షలు పోసి కొంటున్నారు. ఐదు సంవత్సరాలు కష్టపడితే కోటి రూపాయలు సంపాదించవచ్చని చెప్పిన వ్యక్తి మాట కంటే…. ఐదు నిముషాల్లో కోటి రూపాయలు సంపాయించే ఉపాయం నా దగ్గర ఉందనే వ్యక్తి మాటనే కొందరు పూర్తిగా నమ్ముతారు. ఇటువంటి వారే 420 గాళ్ల చేతిలో దారుణంగా మోసపోతుంటారు.
దీంతో యాభై ఏళ్ల క్రితం నాటి పాత టీవీలు, రేడియోలు, టెలిఫోన్ ల లో “ఎర్రటి ద్రావణం (రెడ్ మెర్క్యూరీ )ఉండే” కాప్ సూల్ కోసం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాత టీవీలు, రేడియోలు, టెలిఫోన్లకోసం జనాలు వెతుకులాటలో మునిగారు.ముఖ్యంగా యువత ఈ క్యాప్సూల్ కోసం పాత టీవీలు,పాత రేడియోల కోసం మెకానిక్ షాపుల్లో వెతుకుతున్నారు. చదువు రానివారే కాక చదువుకున్న వారు, ఉద్యోగులు, విద్యావంతులు, బడా బడా రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కోటీశ్వరులు, కొందరు పోలీసులు కూడా… ఈ అవివేకపు ప్రచారాన్ని నమ్మి “రెడ్ క్యాప్సూల్ ” కోసం వెతుకుతున్నారు. మూడేండ్ల కిందటే కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో “రెడ్ మెర్క్యూరీ” వైరలయ్యింది.
* రెడ్ మెర్క్యూరీ అనేది ఉందా ?
మెర్క్యూరీ (పాదరసం) ఉంది. కానీ రెడ్ మెర్క్యూరీ అనేది లేదు. ఇది వట్టి బూటకం. ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా పనిచేసే కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులు భారీగా నిధులు సమీకరించుకునేందుకు, రెడ్ మెర్క్యూరీని “ఆటం బాంబు”తయారీలో ఉపయోగిస్తారని 2000 సంవత్సరంలో గల్ఫ్ దేశాల్లో మోసపూరితంగా తెరపైకి తెచ్చిన కల్పిత ప్రచారం. రెడ్ మెర్క్యూరీ అనేది లేదని, టెర్రరిస్టులు సృష్టించిన అభూతకల్పన అని అమెరికా అంతర్జాతీయ రక్షణ విభాగంలో పనిచేసే జాన్ అర్ బోల్టన్ 2002లో జరిగిన “న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ సెక్యూరిటీ “సమావేశంలో స్పష్టం చేశారు. అప్పటినుండి రెడ్ మెర్క్యూరీ కథ క్రమక్రమంగా ప్రపంచంలోని అన్నిదేశాలకూ పాకింది.