లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన వలస కూలీలు వారి వారి రాష్ట్రాల నుండి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా రాష్ట్రాల గ్రీన్ సిగ్నల్ కోసం పడిగాపులు కాస్తున్నారు. వారి సొంత రాష్ట్రాలు అనుమతిస్తేనే పంపిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. వలస కూలీల కోసం 40 రైళ్లు నడుపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే.. రైల్వే శాఖ జారీ చేసిన ‘స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్’ ప్రకారం ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతాల్లోకి రైళ్ల రాకకు అనుమతించాల్సి ఉందన్నారు. దీంతో కూలీలతో వచ్చే రైళ్లను అనుమతించాలంటూ మధ్యప్రదేశ్, ఛత్తీ్సగఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్, రాజస్థాన్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాశామని తెలిపారు.
తెలంగాణ నుండి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు 2.78 లక్షల మంది వలసకూలీలు పేర్లు నమోదు చేసుకున్నారని సోమేశ్ తెలిపారు. వీరిలో యూపీకి చెందిన 67 వేల మంది, బిహార్కు చెందిన 66 వేలు, పశ్చిమబెంగాల్కు చెందిన 45 వేలు, ఒడిశాకు చెందిన 34 వేలు, జార్ఖండ్ కు చెందిన 29 వేల మంది కూలీలు ఉన్నారని వివరించారు. ఆ రాష్ట్రాలు అనుమతించగానే.. రైళ్లు సిద్ధం కాగానే కూలీలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి పంపిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రం నుంచి 13 రైళ్లను పంపించామని తెలిపారు. రాష్ట్రంనుంచి నడిపిన 13 రైళ్లకు ప్రభుత్వం రూ.1.65 కోట్లు చెల్లించిందని వివరించారు.