ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో పశ్చిమబెంగాల్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడ బీజేపీ-టీఎంసీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని విశ్లేషణలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే.. విజయం ఎవరిని వరిస్తుందన్న ప్రశ్నకు.. టీఎంసీకే ఎడ్జ్ చూపించాయి ఎగ్జిట్ పోల్స్. బొటాబొటి మెజారిటీతో తృణమూల్ గెలుస్తుందని కూడా కొన్ని సంస్థలు అంచనా వేశాయి.
అయితే.. ఇక్కడ మరో కీలకమైన అంశం ఉంది. అదే.. మమతా బెనర్జీ గెలుపు. తన ఆస్థాన నియోజకవర్గమైన భవానీపూర్ ను వదిలి.. నందిగ్రామ్ నుంచి బరిలో నిలిచారు మమత. దీనికి కారణం టీఎంసీ ప్రధాన నేతగా ఉన్న సువేంద్ అధికారి.. తృణమూల్ ను వీడి బీజేపీ గూటికి చేరడమే!
పశ్చిమ బెంగాల్ లో నందిగ్రామ్ కు ఎంతో విశిష్టత ఉంది. మూడు దశాబ్దాలకు పైగా పాలించిన కమ్యూనిస్టుల పతకానికి ఇక్కడే బీజం పడింది. నానో కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకు వామపక్ష ప్రభుత్వం సిద్ధపడి భూ సేకరణ జరపగా.. దీనికి వ్యతిరేకంగా మమత ఉద్యమించారు. ఈ ఉద్యమంలో మమతతోపాటు సువేందు అధికారి కీలక పాత్ర పోషించారు. అంతేకాదు.. నందిగ్రామ్ లో సువేందు అధికారి బలమైన నేతగా ఉన్నారు. అలాంటి నేత ఉన్నట్టుండి కాషాయ తీర్థం తీసుకుని, బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
దీంతో.. మమత తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తనను ధిక్కరించి వెళ్లిన సువేందును ఎలాగైనా ఓడించాలని ఆయనపైనే పోటీకి దిగారు. దీంతో.. హోరాహోరీ పోరు సాగింది. అక్కడ బలమైన నేతగా ఉన్నగా సువేందు ఓ వైపు ఉండగా.. ముఖ్యమంత్రి మరోవైపు నిలవడంతో పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగింది.
ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పాయి. కొన్ని సంస్థలైతే.. మమత ఓడిపోయే అవకాశం ఉందని కూడా జోస్యం చెప్పాయి. దీంతో.. దేశవ్యాప్తంగా అందరి దృష్టీ నందిగ్రామ్ పై పడింది. మరి, ఈ సంగ్రామంలో గెలిచేది ఎవరు? అన్నది చూడాల్సి ఉంది.