ఇటీవల బెంగాల్ ముఖ్యమంత్రి మమత ముఖర్జీపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆమె మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఆమె 24 గంటల పాటు ఎక్కడా ప్రచారంలో పాల్గొనకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈసీ నిర్ణయంపై మమత సీరియస్ అయ్యారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని.. ఈసీ నిర్ణయం అప్రజాస్వామికమని.. రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు.. ఈరోజు 12 గంటలకు కోల్కత్తాలోని గాంధీ విగ్రహం ఎదుట తన నిరసన తెలుపనున్నట్లు సోషల్ మీడియాలో దీదీ ప్రకటించింది. ఏప్రిల్ 12 మన ప్రజాస్వామ్యంలో బ్లాక్ డే అని పేర్కొన్నారు. మార్చి 28, ఏప్రిల్ 7న మమత చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఈసీ వెంటనే ఆ రెండు ప్రసంగాలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. కేంద్ర శక్తులు ఓటర్లను బెదిరించారని.. తిరిగి ఎదురుదాడి చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రచారంలో పాల్గొన్న ఆమె సీఆర్పీఎఫ్ గురించి తీవ్ర ఆరోపణలు చేశారని.. మత ప్రాతిపాదికన ఓట్లు కోరడం ఏంటని నోటీసులు జారీ చేసింది. వీటిపై స్పందించిన మమత తన సమాధానం ఎప్పుడూ ఒకేవిధంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఎన్నికల నిబంధనలు పాటించారా..? వాళ్లు పాటించకున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎన్నికల కమిషన్ తీరును నిరసిస్తూ ఈ రోజు ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు.
మమత ధర్నా చేపట్టనున్న నేపథ్యంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ధర్నా సందర్భంగా మమత ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ధర్నా కార్యక్రమం ఎన్నికల్లో ఏ మేరకు ఫలించనుంది..? సానుభూతితో ఓట్లు రాలుతాయా..? అనేది చూడాలి మరి.
