ప్రపంచ వ్యాప్తంగా వరుసగా పెరగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో ఆందోళన చెందుతున్న ప్రపంచ దేశాలు వరుసగా లాక్ డౌన్ లను ప్రకటిస్తున్నాయి. భారత్ లో ఆదివారం అంతా జనతా కర్ఫ్యూ అమలు చేయగా, సోమవారం నుండి కనీసం 13 రాష్ట్రాలలో ఈ నెలాఖరు వరకు పూర్తిగా లోక్ డౌన్ ప్రకటించారు. మరో కొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా ప్రకటించారు. రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు, మెట్రో రైళ్లు విమానాలు అన్ని మూతబడ్డాయి.
అయితే లాక్ డౌన్ లతో ఈ ప్రాణాంతక వైరస్ ను అడ్డుకోలేమని పంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్వో) నిపుణుడు మైక్ ర్యాన్ స్పష్టం చేశారు. వైరస్ తిరిగి పుంజుకోకుండా ఉండాలంటే కరోనా బాధిత దేశాలు వైరస్ సోకిన వాళ్లను కనిపెట్టి వాళ్లను ఐసోలేషన్ వార్డుకు తరలించడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆయా దేశాలు చేపట్టే కట్టుదిట్టమైన ప్రజారోగ్య చర్యలు కీలకమని అన్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర నిపుణుడు డాక్టర్ మైక్ ర్యాన్ బీబీసీ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. ‘అనారోగ్యంతో ఉన్నవారిని, వైరస్ ఉన్నవారిని కనుగొనడం, వారిని వేరుచేయడం, వారి పరిచయాలను కనుగొని వారిని వేరుచేయడం పై నిజంగా దృష్టి పెట్టాలి. లాక్ డౌన్లతో ప్రస్తుతం ప్రమాదం.. లాక్డౌన్లు విధించినంత మాత్రాన వైరస్ను అడ్డుకోలేం. బలమైన ప్రజారోగ్య సంరక్షణ చర్యలు బలంగా లేకపోతే లాక్డౌన్లు ఎత్తివేసినప్పుడు, ప్రమాదం ముదిరి వ్యాధి తిరిగి మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది.
చైనా, సింగపూర్, దక్షిణ కొరియా వంటి దేశాలు వైరస్ బాధితులను వేగంగా గుర్తించిడంతో పాటు, కఠినమైన చర్యలతో వ్యాధిని కట్టడిచేశాయి. ఆ దేశాలను మిగతా దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైరస్ పై పోరుకు తీవ్రమైన ఆంక్షలను ప్రవేశపెట్టాయి. వర్క్ ఫ్రం హోం, పాఠశాలలు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లు మూసివేత లాంటిచర్యలు చేపట్టాయి.
కరోనా మొత్తం 184 దేశాలకు విస్తరించింది.ఆదివారం మధ్యాహ్నానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,99,391 కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 66,907 మంది కోలుకోగా.. 12,888 మంది మరణించారు. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణకొరియా, స్విట్జర్లాండ్, యూకేల్లో 5 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో 81,054 కేసులు నమోదుకాగా.. 3,261 మంది మృతిచెందారు.
