
నిజామాబాద్ జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొడిచర్ల గ్రామంలో కృష్ణారెడ్డి గ్రామ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. కృష్ణారెడ్డి గత కొంతకాలంగా మానసిక ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నాడు. అయితే ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. సమీపంలోని రుద్రూర్ చెరువులో శవమై కన్పించాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు విచారించిన అనంతరం జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.