ఆనంద్ ఇద్దరు కొడుకులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వారి నుంచి లక్షరూపాయలు తీసుకుని.. కరోనాకు మందు తయారు చేయడం మొదలు పెట్టారట. అయితే.. ఆ ఖర్చుతోనే అందరికీ వైద్యం అందించలేరు కదా.. కాబట్టి, ఈ కరోనా మందుతో కొవిడ్ నుంచి బయటపడినవారు, మందు తయారీకి సామగ్రిని తెచ్చి పెడుతున్నారట. కాగా.. ఆయన ఇచ్చే ముందులో మూడు రకాలు ఉండడం గమనార్హం. కరోనా రాకుండా ఒకటి, వచ్చిన వారికి ఒకటి, సీరియస్ గా ఉన్నవారికి మరొకటి. ఇలా మూడు మందులు ఇస్తున్నారట.
ఈ విషయం వేగంగా పాకడంతో.. ఈ మందులో శాస్త్రీయత ఎంత అనే విషయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో లోకాయుక్త ఆదేశాలతో నిలిపేశారు. నివేదిక కోరడంతో కలెక్టర్ నుంచి రిపోర్టు కూడా వెళ్లింది. ఈ నివేదిక ప్రకారం.. అక్కడ మందు తీసుకున్నవారెవరూ వ్యతిరేక సమాచారం చెప్పలేదట. అందరూ బాగుందని చెప్పినట్టు సమాచారం. అదికూడా ఉచితంగా ఇస్తుండడంతో.. పంపిణీకి మళ్లీ మార్గం సుగమమైంది.
ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారం చుట్టూ రాజకీయ నాయకులు చేరిపోవడం గమనార్హం. ఈ మందు చాలా బాగుందని ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించడం లేదంటూ విపక్ష నేతలు అప్పుడే వకాల్తా పుచ్చుకోవడం గమనార్హం. టీడీపీ నేతలు కొందరు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో చేప మందును ప్రోత్సహించినప్పుడు ఇక్కడ ఈ మందును ఎందుకు ప్రోత్సహించరనేది వారి ప్రశ్న.
అయితే.. ఈ మందు శాస్త్రీయతపై సందేహాలు అలాగే ఉన్నాయి. ఇటు చూస్తే.. రాజకీయ నాయకులు దీని చుట్టూ చేరిపోతున్నారు. దీంతో.. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలని అంటున్నారు చాలా మంది. ప్రజలకు మంచి జరిగితే ఎవ్వరూ కాదనరు, కానీ.. శాస్త్రీయత నిరూపణ ఖచ్చితంగా అవసరమని అంటున్నారు. లేకపోతే.. రేప్పొద్దున మరిన్ని రోగాలకు తాము మందు ఇస్తున్నామంటూ మరికొందరు వచ్చే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.