తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ముదురుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ సర్కారు రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను చేపడుతోందని తెలంగాణ సర్కారు విమర్శించింది. అంతేకాదు.. ఆధారాలతో ఫిర్యాదులు కూడా చేసింది. అయితే.. కృష్ణాబోర్డు పనులు ఆపాలని చెప్పినా.. ఏపీ సర్కారు తన పని తాను చేసుకుపోతోందని భావిస్తున్న తెలంగాణ.. తాము మాత్రం నిబంధనలను ఎందుకు పాటించాలని వాదిస్తోంది.
ఇందులో భాగంగానే శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తి మొదలు పెట్టింది. స్వల్పంగా వస్తున్న వరదనీటితోపాటు డెడ్ స్టోరేజీలో ఉన్న నీటితోనూ కరెంట్ తయారు చేస్తోంది. ఈ విషయమై ఏపీ ఫిర్యాదు చేయడంతో.. విద్యుత్ ఉత్పత్తి ఆపాలని కృష్ణాబోర్డు ఆదేశించింది. అయినప్పటికీ.. తెలంగాణ సర్కారు తమ పని తాము చేసుకుపోతోంది.
కేవలం శ్రీశైలం ప్రాజెక్టులోనే కాకుండా.. పులిచింత ప్రాజెక్టు పవర్ హౌస్ లోనూ విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. ఈ ప్రాజెక్టు ఏపీలో ఉన్నా.. పవర్ హౌస్ తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాజెక్టు నీటితో దాదాపు 30 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్టు సమాచారం. ఇదే కొనసాగితే.. త్వరలోనే ప్రాజెక్టు నిండుకునే అవకాశం ఉంది. ఈ నీరు కృష్ణా డెల్టాకు చాలా ముఖ్యం. అటు నాగార్జున సాగర్ లోనూ కరెంటు తయారు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదే విషయమై నిన్న జరిగిన ఏపీ కేబినెట్ లో సీఎం జగన్ మాట్లాడుతూ.. అనుమతి లేకుండానే తెలంగాణ సర్కారు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతోందని అన్నారు. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. తమ విద్యుత్ ఉత్పత్తిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. తెలంగాణ ఏం చేయాలో ఆంధ్రప్రదేశ్ చెబుతుందా? అని అన్నారు. రాయలసీమ ప్రాజెక్టు, ఆర్డీఎస్ పైనా విరుచుకుపడ్డారు. అవి ముమ్మాటికీ అక్రమమేనని చెప్పారు.
మొత్తానికి ఈ జల జగడం చినికి చినికి గాలివానగా మారుతోంది. సమసిపోయిందనుకున్న జల వివాదం.. తిరిగి మొదలు కావడంతో ఒకింత ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మళ్లీ.. ఏపీ, తెలంగాణ ప్రాంతీయ విభేదాలు విస్తృతమవుతాయా? అనే భయం కూడా పలువురిలో వ్యక్తమవుతోంది. మరి, చివరకు ఈ సమస్య ఏ రూపు తీసుకుంటుందో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Krishna water dispute between ap telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com